Hit Run: హిట్ అండ్ కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మకు కోర్ట్ రిమాండ్ విధించింది. బైక్తో ఢీకొట్టి రైతు మృతికి కారణమైన ఆరవ్ వర్మను తప్పించేందుకు సీదిరి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన రోజు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా.. తన కొడుకుని సీదిరి స్వయంగా ఆస్పత్రికి తీసుకొచ్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆరవ్ వర్మే యాక్సిడెంట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు సీదిరిపై కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ కేసు వెనుక సినిమా రేంజ్ డ్రామా నడిచింది. శుక్రవారం రాత్రి దానయ్య అనే గొర్రెల కాపరి బైక్ ఢీకొని మృతి చెందగా.. ప్రమాదానికి కారణమైన బైకును తానే నడిపానంటూ సిద్ధార్థ్ అనే వ్యక్తి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కూడా తూతూమంత్రంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి అతడిని పంపించేశారు. కానీ, ప్రమాదం చేసింది మాజీ మంత్రి కొడుకు ఆరవ్ వర్మ అంటూ బాధితులు స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు నిందితుడిని తప్పించేందుకు పోలీసులు సహకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Also read: Minor Driving: పిల్లలపై ప్రేమతో ఇలా చేస్తున్నారా.. అయితే డేంజర్లో పడినట్టే..?
ట్విస్టులతో సాగుతున్న ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ టర్నింగ్ పాయింట్గా మారింది. ప్రమాదం జరగడానికి కొద్ది నిమిషాల ముందు, ఆరవ్ వర్మ ఒక బంక్లో పెట్రోల్ కొట్టిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ కీలక ఆధారంతో పోలీసులు రూట్ మార్చక తప్పలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ప్రమాదం చేసింది ఆరవ్ వర్మేనని నిర్ధారించుకున్న పోలీసులు, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
ఈ కేసులో సాక్ష్యాలను మరుగున పరిచేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దృష్టి సారించారు పోలీసులు. ఓ మాజీ మంత్రే కేసును తప్పుదారి పట్టిస్తే.. సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై కోర్ట్ ఎలా తీర్పు ఇస్తుందో చూడాలి?
Storey By: Appa Rao big Tv
Also read: POCSO Case: షాబాద్ ఘటనను మించిన ట్విస్ట్.. మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు!