Space Wars: భూమిపైన అణుయుద్ధాలు రుచి చూసిన ప్రపంచం.. ఇప్పుడు, స్టార్ వార్స్ మూవీ మాదిరి అంతరిక్ష యుద్ధాలకు సిద్ధం అవుతోంది. ఇటీవల కాలంలో చైనా.. స్పేస్ వార్కి అవసరమైన వార్ వెపన్స్ని అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే, చైనా కక్ష్యలో ఐదు ఉపగ్రహాలు డాగ్ఫైటింగ్ కోసం రెడీగా ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. అయితే, ఇది చైనా ప్రధాన ప్రత్యర్థి అమెరికాతో పాటు.. ఆసియాలో చైనాకు పోటీగా ఉన్న భారత్కి కూడా ప్రమాదకరమైన పరిస్థితిగానే చూడాలి. అందుకే, అంతరిక్షంలో భారత్ సరికొత్త వ్యూహాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా.. త్వరలో, భారత్ అంతరిక్ష సైనిక సిద్ధాంతాన్ని ప్రకటించనుంది. అయితే, స్పేస్ వార్లో భారత్ ప్లాన్ ఏంటీ..? ఇండియా రూపొందిస్తున్న మిలటరీ స్పేస్ డాక్ట్రీన్ వ్యూహమేంటీ..?
చైనా చర్యలతో అంతరిక్ష యేద్ధం తప్పదనే సూచనలు
భూమిని దాటి అంతరిక్ష యుద్ధాలకు ప్రపంచం రెడీ అవుతోందా..? చైనా స్పేస్ కుట్రలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నాయా..? త్వరలో స్పేస్ వార్ అనివార్యమా..? రియల్ లైఫ్ స్పేస్ వార్ జమానా వచ్చినట్లేనా..? పరిస్థితులన్నీ చూస్తుంటే అవుననక తప్పదు. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే గ్రాఫిక్స్తో అంతరిక్ష యుద్ధాలకు సంబంధించిన మూవీస్ మాదిరి.. రియల్ లైఫ్లో స్పేస్ వార్కి అగ్రదేశాలన్నీ సిద్ధం అవుతున్నాయి. చైనా చర్యలతో త్వరలో అంతరిక్ష యుద్ధం తప్పదనే సూచనలు ఉన్నాయి. అంతరీక్ష పరిశోధనా కార్యక్రమాల్లో అమెరికాను సవాలు చేస్తున్న చైనా.. స్పేస్లో సైనిక సామర్థ్యాలు పెంచుకుంటోంది.
అంతరిక్ష వ్యూహాలకు పదునుపెడుతున్న భారత్
ప్రస్తుత పరిస్థితులను బట్టి, ఆకాశమే హద్దుగా అగ్రదేశాల మధ్య పోటీ శృతిమించుతోంది. ఈ క్రమంలోనే.. తాజాగా భారత్ సైతం తన అంతరిక్ష వ్యూహాలకు పదునుపెడుతోంది. చైనా కక్ష్యలో ఇప్పటికే యుద్ధానికి సిద్ధంగా ఉపగ్రహ కదలికలున్నాయన్న నివేదికలతో భారత్, తన అంతరిక్ష సైనిక సిద్ధాంతాన్ని రూపొందిస్తోంది. మరో రెండు మూడు నెలల్లో ‘మిలటరీ స్పేస్ డాక్ట్రీన్’ ప్రకటిస్తామంటూ తాజాగా భారత చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. దీనితో, భారత్ అంతరిక్ష యుద్ధానికి రెడీ అయినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి.
మిలటరీ స్పేస్ పాలసీని తీసుకొచ్చే దిశగా బారత్ చర్యలు
ఇప్పటికే, డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీని స్థాపించిన ఇండియా… రాబోయే నెలల్లో ‘మిలటరీ స్పేస్ డాక్ట్రీన్’తో పాటు మిలటరీ స్పేస్ పాలసీని కూడా తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ప్రకటించారు. తాజాగా, ఇండియన్ డిఫెన్స్ సింపోజియంలో మాట్లాడిన ఆయన… ‘అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామిగా ఎదగాలనీ.. దానికి సంబంధించి మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను సృష్టించడానికి పరిశ్రమల భాగస్వామ్యాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు దృష్ట్యా.. యుద్ధంలో ఆధిపత్యం చెలాయించడానికి అంతరిక్షం కొత్త డొమైన్గా మారుతుందని అన్నారు. అయితే, దీని కోసం భారత్ ‘స్పేస్ కల్చర్ని’ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని జనరల్ చౌహాన్ తెలిపారు.
డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంస్కరణలు
ఈ క్రమంలో.. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను పెంపొందించే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్కరణలను ప్రవేశపెట్టిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. ఇక, రెండు, మూడు నెలల్లోనే మిలటరీ స్పేస్ డాక్ట్రీన్ను తీసుకొచ్చేందుకు భారత డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ కృషి చేస్తోందని అన్నారు. అలాగే, భారత్ ‘జాతీయ సైనిక అంతరిక్ష విధానం’పై కూడా పని చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇస్రో, ఫ్రైవేట్ రంగం మధ్య భాగస్వామ్యంతో..
ఇప్పటికే.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో, ప్రైవేట్ రంగం మధ్య భాగస్వామ్యంతో ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్, నిఘా కోసం ఉపగ్రహాలను ప్రయోగించడానికి చొరవ చూపుతున్నట్లు ఇండియా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ప్రకటించారు. ఈ మేరకు, భారత్ వ్యూహం స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశీయ మార్కెట్ను అనుకరించడం నుండీ.. అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, అంతరిక్షంలో వరల్డ్ లీడర్గా భారత్ను నిలబెట్టడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు. భారత అంతరిక్ష సంఘం చైర్మన్ జయంత్ పాటిల్ కూడా దీన్ని ధృవీకరించారు. ప్రస్తుతం భారత అంతరిక్ష రంగం కీలకమైన మలుపు దశలో ఉన్నమాట వాస్తవం.
నిఘా, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, జామర్లు…
ఈ క్రమంలో.. భారత డిఫెన్స్ ఇండస్ట్రీ కూడా దాని భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడంలో సీరియస్గా పనిచేస్తోంది. ఇండియన్ ఇండస్ట్రీ ఇప్పటికే నిఘా, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, జామర్లు, ట్రాకింగ్ రాడార్లు వంటి టెక్నాలజీలను సిద్ధం చేసుకొని, సామర్థ్యాన్ని నిరూపించుకుంది. ఇక, ఇలాగే ముందుకు సాగుతూ.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల మధ్య సహకారంతో సరికొత్త ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి చర్యలు చేపడుతోంది. ఇది, అంతరిక్షంలో జాతీయ భద్రతను పెంచడంలో కీలకంగా మారనుంది.
గూఢచర్యం, సమాచార సేకరణ, నిఘా,ఉపగ్రహ నిరోధకాలు..
భారత సైనిక అంతరిక్ష వ్యూహం అంటే.. దేశ రక్షణ, భద్రత కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడం. ఇందులో గూఢచర్యం, సమాచార సేకరణ, నిఘా, ఉపగ్రహ నిరోధక సామర్థ్యాలు, సైనిక అవసరాల కోసం ఉపగ్రహాలను ఉపయోగించడం వంటివి ఉంటాయి. ఈ క్రమంలో.. భారత్, తన సరిహద్దుల రక్షణను, భద్రతను పటిష్టం చేయడానికి.. అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా అంతరిక్ష వ్యూహాలను రూపొందిస్తోంది.
గూఢచార సేకరణ, నిఘాలో భాగంగా.. శత్రువుల కదలికలు, వారి వ్యూహాలను గమనించడంతో పాటు, సరిహద్దుల పర్యవేక్షణ, ఇతర రక్షణ సంబంధిత సమాచారాన్ని సేకరించే చర్యలు చేపడుతోంది. అలాగే, ఉపగ్రహ నిరోధక సామర్థ్యాన్ని పెంచుకొని.. ఇతర దేశాల ఉపగ్రహాలు దాడికి దిగితే ప్రతిదాడులు చేయడం వంటి వ్యూహాత్మక రక్షణకు అవసరమైన టెక్నాలజీని రూపొందిస్తున్నారు. ఇక, సైనిక అవసరాల కోసం ఉపగ్రహాలను ఉపయోగించాలని అనుకుంటోంది. అందుకే, స్పైస్ మిలటరీ కోసం సరికొత్త కమ్యూనికేషన్, నావిగేషన్, ఇమేజింగ్ సిస్టమ్లను అభివృద్ధి చేస్తున్నారు.
అంతరిక్ష సైనిక అవసరాలకు ఇస్రో ఉపగ్రహాల అభివృద్ధి
భారత్ అంతరిక్ష మిలటరీని రూపొందించడంలో కొన్ని ప్రధాన సంస్థలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఇందులో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీలకంగా ఉంది. అంతరిక్ష సైనిక అవసరాలకు అనుగుణంగా ఇస్రో ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తుంది. మరోవైపు.. రక్షణ రంగంలో పరిశోధన, అభివృద్ధి దిశగా డీఆర్డీఓ పనిచేస్తోంది. సైనిక అవసరాల కోసం అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. అలాగే, 2019లో, దేశ అంతరిక్ష వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం స్పేస్ డిఫెన్స్ ఏజెన్సీని స్థాపించింది. ఈ సంస్థ అంతరిక్ష యుద్ధం అనివార్యమైతే తీసుకోవాల్సిన వ్యూహాలను పరిశీలిస్తోంది.
Also read: ఏందయ్యా మీది.. రోజుకో లొల్లి! అధిష్టానం సీరియస్
స్పేస్ టెక్నాలజీని స్పేస్ మిలటరీ పవర్గా మార్చే ప్లాన్
2019లో భారత్ తన ఉపగ్రహ నిరోధక ASAT సామర్థ్యాన్ని ప్రదర్శించినప్పుడు అంతర్జాతీయంగా వివాదాస్పదమయ్యింది. అయినప్పటికీ.. భారత్ తన స్పేస్ టెక్నాలజీని.. స్పేస్ మిలటరీ పవర్గా మార్చే దిశగా ముందుకు సాగుతోంది. నిజానికి, సైనిక అవసరాల కోసం స్పేస్ టెక్నాలజీని ఉపయోగించడంలో చైనాతో పాటు ఇతర అగ్రదేశాలతో పోల్చుకుంటే భారత్ వెనుకబడి ఉంది. అందుకే, భారత్ తన అంతరిక్ష కార్యక్రమాలను బలోపేతం చేయాలనీ, వ్యూహాత్యక సైనిక సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది.
ఇండో పసిఫిక్ దేశాలతో భారత్ లోతైన సహకారం
అంతర్జాతీయంగా భారత్కి పెరుగుతున్న బలానికి అనుగుణంగా మిలటరీ స్పేస్ డాక్ట్రీన్ని రూపొందించడం అత్యవసరంగా మారింది. అందుకే, రాబోయే ప్రాంతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భాగంగా.. ఇండో-పసిఫిక్ దేశాలతో లోతైన సహకారాన్ని ఏర్పరచుకోడానికి భారత్ ప్రయత్నిస్తోంది. సాధారణంగా దేశాలన్నీ వాటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా వాటి విదేశాంగ విధాన వైఖరిని, జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయిస్తాయి. అలాగే, భారత్ కూడా దక్షిణాసియాలోని పరిస్థితులకు అనుగుణంగానే తన వ్యూహాలను రూపొందిస్తోంది.
తూర్పు, పశ్చిమ ప్రాంతంలో అణ్వస్త్ర దేశాలైన చైనా, పాకిస్తాన్లతో పరిష్కారం కాని సరిహద్దు వివాదాలు.. ముఖ్యంగా, చైనాతో అన్ని రంగాల్లోనూ తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే, చైనా భారత్లో భూభాగాలపై కన్నేసింది. పాకిస్తాన్ను, బంగ్లాదేశ్ని వినియోగించుకుంటూ.. భారత్లో అస్థిరతను పెంచే ప్లాన్లు గీస్తోంది. లడఖ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్లో చైనా తన ఉనికిని విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది. మరోవైపు, చికెన్ నెక్ కేంద్రంగా ఈశాన్య భారత్ను చీల్చడానికి పావులు కదుపుతోంది. ఈ నేపధ్యంలో.. పౌర, సైనిక రంగంలో సామర్థ్యాన్ని పెంచుకోవడం భారత్కు అనివార్యంగా మారింది. ఇక, చైనా అంతరిక్ష సామర్థ్యాలు, అభివృద్ధి తర్వాత.. ఆర్థిక, జాతీయ భద్రత రెండింటికీ ప్రధాన్యత ఇవ్వడం భారత్కు కీలకంగా మారింది. ఈ దిశగానే ఇప్పుడు భారత్ అంతరిక్ష యుద్ధానికి కూడా సిద్ధం అవుతోంది.