Butta Renuka: వైసీపీ అధ్యక్షడు జగన్ తన సొంత ఇలాకా ఆయిన రాయలసీమలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. ఎన్నికలు జరిగి రెండవ ఏడాది గడవక ముందే మరోసారి పార్టీ అధిష్టానం సెగ్మెంట్ల ఇన్చార్జిలను మార్చేస్తోంది. గత ఎన్నికల్లో చేసిన ప్రయోగాలు వికటించడంతో జగన్ గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆ క్రమంలో మొదట సొంత ఇల్లు చక్కబెట్టుకుని రచ్చకెక్కాలని జగన్ రెడీ అవుతున్నారట. రాయల సీమలోని నాలుగు జిల్లాల్లో నియోజకవర్గాల్లో పరిస్థితుల్ని సరిదిద్దే పనిలో ఉన్నారట. ఈ క్రమంలోనే ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జ్గా ఉన్న బుట్టా రేణుకని తప్పించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్గా బుట్టా రేణుక తొలగింపునకు ప్రధాన కారణం ఏంటి? దానికి అనేక కారణాలు ఉన్నట్టు నియోజకవర్గంలో చర్చ నడుస్తోందట. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల టైమ్ ఉండగానే ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులను వైసీపీ సెట్రైట్ చేసే ప్రయత్నం చేస్తోంది. పార్టీలో గ్రూపులు, వర్గాలుగా విడిపోయి విభేదాలు ఉన్న సెగ్మెంట్లలో ఒక్కో నేతను మెల్లగా సెట్ చేస్తోంది వైసిపి అధిష్టానం.
ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ ఛార్జ్గా ఉన్న బుట్టా రేణుకను తప్పించి మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గానికి లైన్ క్లియర్ చేసింది. సేమ్ టైమ్ బుట్టా రేణుకను కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా కన్ఫార్మ్ చేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుట్టా రేణుక 2014 లో కర్నూలు నుంచి ఎంపీగా గెలిచారు. 2018 టైమ్లో ఆమె వైసీపీని వీడి అధికారంలో ఉన్న టిడిపిలో చేరారు. తిరిగి ఎన్నికల సమయంలో 2019లో సొంతగూటి చేరారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఆమెకు టికెట్ ఇవ్వలేదు. 2019 జరిగిన ఎన్నికలలో వైసీపీ అధిష్టానం కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ కు అవకాశం కల్పించింది. మాజీ ఎంపీ బుట్టా రేణుక చేసేదేం లేక ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. నిన్నటిదాకా ఎమ్మిగనూరు ఇన్చార్జిగా పని చేస్తూ వచ్చారు.
అయితే ఎమ్మిగనూరులో గతంలో గెలిచిన మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి వర్గం ఒకవైపు, మరోవైపు బుట్టా రేణుక వర్గం పార్టీని రెండుగా విభజించి రోడ్డున పడేశారని అధిష్టానంకు రిపోర్టులందాయట. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా రెండుగా చీలిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడంతో బుట్టా రేణుకను పార్లమెంటుకు పంపించి, చెన్న కేశవ రెడ్డి వర్గానికి ఊరట కలిగించారని అంటున్నారు. చెన్న కేశవ రెడ్డి మనవడు రాజీవ్ రెడ్డికే ఎమ్మిగనూరు ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో వ్యవహారం సెట్ అయిన్నట్లే అని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. అయితే బుట్టా రేణుక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలని అనుకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఆమె రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తున్నారట. ఇప్పుడు ఎమ్మిగనూరు పంచాయతీకి ఎండ్ కార్డు వేసేందుకు వైసీపీ అధినేత ఆమెను కర్నూలు పార్లమెంట్ సమన్వయ కర్తగా నియమించడం ఆమె వర్గీయులను కలవరపరుస్తోందంట.
వైసీసీ అధిష్టానం నిర్ణయంతో మాజీ ఎంపీ బుట్టా రేణుక ఎలా రియాక్ట్ అవుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు చూస్తే 2024లో కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బీ వై రామయ్యకు ఎక్కడ అవకాశం ఇస్తారు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కర్నూలు మేయర్గా బివై రామయ్య పదవి కాలం కూడా ముగియడంతో రానున్న రోజుల్లో మేయర్ రామయ్యకు పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పజెప్తుందో అన్న ఉత్కంఠ బి వై రామయ్య అనుచరులలో మొదలైందట.
ఎమ్మిగనూరు, వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక తప్పించడంతో నియోజకవర్గం పార్టీలో ముసలం మొదలైందట. బుట్టా అనుచరులంతా తమ పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మనవడు ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజక వర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎర్రకోట రాజీవ్ రెడ్డిని నియోజక వర్గ ఇన్ఛార్జిగా పెట్టడంపై వైసీపీలోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉందట. ఆ క్రమంలో భవిష్యత్ కార్యాచారణపై బుట్టా వర్గం దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.
మాజీమంత్రి చెన్నకేశవరెడ్డికి వయసు రీత్యా గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మిగనూరు టికెట్ ఇవ్వలేదు. తన కొడుకు జగన్ మోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అడిగినా గతంలో ఓడిపోవడంతో అధిష్టానం నిరాకరించింది. బుట్టా రేణుక సామాజికవర్గం ఎక్కువగా ఉండడంతో ఎమ్మిగనూరు నుంచి ఆమెను బరిలోకి దించింది. అయితే గ్రూప్ తగాదాలతోనే తమ నాయకురాలు ఓడిపోయినట్లు బుట్టా రేణుక వర్గం ప్రచారం చేస్తోంది. నియోజక వర్గ ఇన్ఛార్జి పదవి కోసం పార్టీలో కొంతకాలంగా గట్టి పోటీ నెలకొన్నప్పటికీ అధిష్టానం మాత్రం రాజీవ్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. దీంతో సీనియర్ నేత ఎర్రకోట కేశవ రెడ్డి పంతం నెగ్గిందన్న టాక్ వినిపిస్తోంది.
గతంలో ఎమ్మిగనూరు ఇన్చార్జ్గా బుట్టా రేణుకను ప్రకటించిన జగన్ మాజీ ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డిని కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించిన బుట్టా రేణుక ఆచరణలో పెట్టట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంపట్టున్న కేశవ రెడ్డి స్వయంగా జగన్ దగ్గరికి వెళ్లి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టడంతో బుట్టా రేణుకను తొలగించి ఆయన మనవడు రాజీవ్ రెడ్డికి పగ్గాలు అప్పగించారంట. బుట్టా అనుచరులు కొత్తగా వచ్చిన యువ నాయకుడి రాజీవ్ రెడ్డికి సపోర్ట్ చేసేదేలే అంటూ అల్టిమేట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
Story by Apparao, Big Tv