CII Partnership Summit: ఆంధ్రప్రదేశ్ను ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు మాట ఇచ్చామని ఆయన నొక్కిచెప్పారు. విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ ఇందుకు వేదిక కానుందని, ఈ వివరాలను ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో లోకేష్ వెల్లడించారు.
గత 16 నెలల్లోనే రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, ఇవి కేవలం ఎంఓయూలు కావని, ఆర్సెలర్ మిట్టల్, గూగుల్ డేటా సిటీ, బీపీసీఎల్ రిఫైనరీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ వంటి వాస్తవ రూపం దాల్చుతున్న ప్రాజెక్టులని మంత్రి అన్నారు. ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంతో పనిచేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, వేగవంతమైన అనుమతులు ఇందుకు కారణాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ మాత్రమే కాదని, ‘నమో’ (నాయుడు మరియు మోడీ) ప్రభుత్వం రూపంలో ‘డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్’ ఉందని ఆయన అభివర్ణించారు.
Read Also: Top 20 News Today: పేలుళ్లకు, బీజేపీకి సంబంధం ఉందంటున్న మెదక్ ఎంపీ, ఇంద్రకీలాద్రిపై రాజకీయ ఆంక్షలు
సీఐఐ (CII) సదస్సుకు ముందే, నవంబర్ 13న, విశాఖపట్నంలో పలు ప్రతిష్టాత్మక ఐటీ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ భూమిపూజ చేయనున్నారు. ఇందులో భాగంగా సెయిల్స్ సాఫ్ట్వేర్, ఐ స్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మిన సాఫ్ట్వేర్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్లకు శంకుస్థాపన జరగనుంది. వీటితో పాటు మధురవాడలో రహేజా కార్ప్ నిర్మించనున్న రూ.2,172 కోట్ల ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు, యండాడలో కపిల్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించే వరల్డ్ ట్రేడ్ సెంటర్కు కూడా మంత్రి శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ ఏఐ హబ్ (Google AI Hub) వంటి దిగ్గజ సంస్థలు విశాఖకు రావడంతో, ఈ నూతన ప్రాజెక్టులు నగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చనున్నాయి.
విశాఖలో జరగబోయే సీఐఐ సమ్మిట్కు సర్వం సిద్ధమైందని లోకేష్ తెలిపారు. ఈ సదస్సులో 410 ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, వీటి ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. ఈ సమ్మిట్కు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు హాజరుకానున్నారు. సదస్సు సమయంలోనే రూ. 2.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతాయని, ఇది రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నాంది పలుకుతుందని మంత్రి లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.