Nizamabad Municipal Elections: నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఎంఐఎం పార్టీ కలవర పెడుతుందా..? ఆ కార్పొరేషన్తో పాటు జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లోనూ పతంగి పార్టీ కీలకంగా మారనుందా..? మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఆశించిన దాని కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోవడం. ఆ పార్టీకి తెలంగాణలో కూడా కలిసి రానుందా..? కింగ్ ఎవరైనా.. కింగ్ మేకర్గా మాత్రం ఎంఐఎం పార్టీనే నిలుస్తుందా? అసలు నిజామాబాద్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రాబల్యంపై జరుగుతున్న చర్చేంటి? .. రెండు జాతీయ పార్టీలకు ఎంఐఎం ఎందుకు కలవర పెడుతోంది?
నిజామాబాద్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, బీజేపీ కసరత్తు
నిజామాబాద్ జిల్లాలో.. మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్-బీజేపీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కానీ మజ్లిస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో తమ ఆధిక్యాన్ని చాటుకుటుండటం ఆ రెండు పార్టీలను కలవరపెడుతోందంట. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో కింగ్ మేకర్ అవ్వాలని పతంగి పార్టీ ఉవ్విళ్లూరుతోందట.
మహారాష్ట్ర మున్సిపోల్స్లో ప్రభావం చూసిన అసద్ పార్టీ
జిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ గణనీయమైన ప్రభావాన్ని చాటుకుంది. ముఖ్యంగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కంటే ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉండటం గమనార్హం. ఇక బీఎంసీ పరిధిలో తొలిసారి ఎంఐఎం బోణీ కొట్టింది. ఆసియాలోనే అత్యంత సంపన్న మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ ..బీఎంసీలో ఎంఐఎం తన మొదటి విజయాన్ని నమోదు చేసి చరిత్ర సృష్టించింది. అలాగే ఆ రాష్ట్రవ్యాప్తంగా 13 కార్పొరేషన్ల పరిధిలో మొత్తం 89 స్థానాలను గెలుచుకుంది. శంభాజీనగర్, మాలెగావ్ వంటి నగరాల్లో కింగ్ మేకర్ పాత్రను పోషించే స్థాయికి ఎదిగింది.
నిజామాబాద్, బోధన్, ఆర్మూర్లపై ఎంఐఎం ధీమా
ఆ స్పూర్తితో.. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్ లోనూ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని మజ్లీస్ ధీమాతో ఉందంట. మేయర్ పీఠం లక్ష్యంగా పావులు కదుపుతున్నా.. డిప్యూటీ మేయర్ పక్కా అని లెక్కలు వేసుకుంటుందట. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా గత ఎన్నికల్లో 16 డివిజన్లు గెలుచుకుని రెండో అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎంఐఎం డిప్యూటీ మేయర్ చేజిక్కించుకుంది. ఈ సారి 20 సీట్లలో గెలిచేలా.. ఎంఐఎం నేతలు ప్లాన్ వేస్తున్నారట. ఈ సారి కూడా మేయర్ ఎన్నికల్లో ఆ పార్టీ కింగ్ మేకర్ అవుతుందనే టాక్ నడుస్తోంది. ఐతే మైనార్టీ డివిజన్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టడంతో ఎంఐఎం స్పీడ్కు ఏ మేరకు బ్రేకులు పడతాయో చూడాలి.
బోధన్ మున్సిపాలిటీలో ప్రభావం చూపుతుందా?
నిజామాబాద్ కార్పొరేషన్ లో గతంలో డిప్యూటీ మేయర్ పదవి చేజిక్కించుకున్న ఎంఐఎం.. ఈ సారి అంతకు మించి అంచనాలతో బరిలో దిగుతుందట. ఇటు బోధన్ మున్సిపాలిటీలోనూ ఆ పార్టీ ప్రభావం చాటాలని చూస్తోందంట. 38 డివిజన్ల కు గాను.. 16చోట్ల ఎంఐఎం కీలకంగా ఉందంటున్నారు. గత ఎన్నికల్లో 11 డివిజన్లు గెలుచుకున్న మజ్లిస్, ఈ సారి మరిన్ని వార్డులు గెలుచుకుని కింగ లేదా కింగ్ మేకర్ కావాలని ఉవ్విళ్లూరుతోందట.
ఆర్మూర్లో రెండు అంకెల స్థానాలపై గురి..
ఇటు ఆర్మూర్ మున్సిపాలిటీలోనూ ఎంఐఎం ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తోందంట. 36 వార్డులకు గతంలో ఒక వార్డు గెలుచుకోగా.. ఈ సారి రెండు అంకెల స్దానాలపై గురి పెట్టిందట. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల విజయంతో.. ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగినట్లు కనిపిస్తోంది. అక్కడి ఫలితాల ఎఫెక్ట్ .. జిల్లాలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో మెజార్టీ మైనార్టీ డివిజన్లలో ఎంఐఎం సత్తా చాటాలని చూస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మైనార్టీల్లోనూ పట్టు కోల్పోకుండా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందట.
Also Read: వ్యాఖ్యల తంటా.. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అంబటి రాంబాబు, రెండువారాలు అక్కడే
జిల్లాలో తమ ప్రాబల్యం పెరిగాలని బీజేపీ భావిస్తుంటే.. తగ్గించాలని కాంగ్రెస్ మైనార్టీ డివిజన్లపై ఫోకస్ పెట్టిందట. ఎంఐఎం మాత్రం ఈ సారి పట్టు సాధించి కింగ్ లేదా కింగ్ మేకర్ కావాలని పట్టుదలతో ఉందట. ఆ క్రమంలో ఎంఐఎంకు కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో కాని కింగ్ అయ్యే అవకాశాలు మాత్రం లేవని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి ఎంఐఎం ఆశలు ఏ మేరకు నెరవేరతాయో?
Story By Apparao, Bigtv