Secunderabad Bonalu: తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. సికింద్రాబాద్లోని చరిత్రాత్మక శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో ఆషాఢ మాస లష్కర్ బోనాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శించుకుంటున్నారు. మహిళలు సాంప్రదాయ వస్త్రాలు ధరించి, వేప ఆకులు, పసుపు, బెల్లం, వండిన అన్నంతో అలంకరించిన బోనాలు తలపై మోసుకొని అమ్మవారికి సమర్పిస్తున్నారు. గోల్కండ టు లష్కర్ వయా బల్కంపేట. ఉజ్జాయినీ మహకాంళి సన్నిధిలో అర్ధరాత్రి నుంచి బోనాల సందడి జరగనుంది.
జంట నగరాల్లో బోనాల జాతర జోరందుకుంటుంది. ఆషాడమాసం అమావాస్య తర్వాత వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ ఖిల్లాలో జగదాంబకు తొలి బొనం సమర్పిస్తారు. ఆ తర్వాత బల్కంపేట ఎల్లమ్మల తల్లికి రెండో బోనం సమర్పిస్తారు. అదే ఆనవాయితీగా మూడో బోనాన్ని సికింద్రాబాద్ ఉజ్జాయిని మహంకాళికి సమర్పిస్తున్నారు. పండగంటే బోనాల పండుగే అనేలా వుంటుంది సందడి .
పవిత్ర భోజనం. అన్నం, పాలు, బెల్లంతో భక్తి శ్రద్దలతో పరమాన్నాన్ని వండుతారు భక్తులు. కొత్త కొండను తెచ్చి పసుపు కుంకుమ పెట్టి వేపాకులతో అలంకరించిన బొనంలో పరమాన్నాన్ని తీసుకెళ్లి తల్లికి నైవేద్యంగా సమర్పిస్తారు. నిండు కుండ తొణకదు. భక్తి ప్రపత్తులతో.. బోనం ఎత్తితే కోరిన కోరికలు తీరకుండా వుండవు. మంచి మనసుతో అమ్మను ప్రార్ధిస్తే సకల శుభాలు కలుగుతాయనేది అనాదిగా భక్తుల విశ్వాసం. సురటి అప్పయ్య మానవీయత, భక్తితర్పతనే అందుకు నిదర్శనం.
ఎప్పటి మాదిరిగా ఈసారి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. భవిష్యవాణి చెప్పే రంగంతో లష్కర్ బోనాలు పరి సమాప్తమవుతాయి. పాతబస్తీ లాల్ దర్వాజ శ్రీసింహవాహినీ మహంకాళి బోనాలు మొదలవుతాయి. అమ్మోరిని ఏనుగు అంబరిపై ఉరేగిస్తారు. ఆ తరువాత నిమజ్జనోత్సవంతో జంట నగరాల్లో ఆషాడ బోనాల జాతర ముగుస్తుంది.
అన్నం పరబ్రహ్మ స్వరూపం. బోనాల పరమార్ధం కూడా అదే. అమ్మలగన్న అమ్మ చెప్పిన మాట ఇది. ముగ్గురమ్మల మూల పుటమ్మ చూపిన బాటలో లష్కర్లో బోనాల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. పిలిస్తే భవిష్యవాణిగా పలకడమే కాదు.. భక్తితో ఆర్తితో తలిస్తే చాలు కదలివచ్చే కారుణ్యమూర్తి మహంకాళి అమ్మవారు. ఆ చల్లని తల్లి ఉజ్జయిని నుంచి సికింద్రాబాద్కు ఎలా తరలివచ్చిందో తెలుసా. అన్నం పెట్టే ప్రకృతిని అమ్మోరి స్వరూపంగా తలిచి మనసారా కొలిచే వేదికను బోనాల వేడుక. బోనం ప్రకృతికి ప్రాణ కోటికి మధ్య నిజమైన ఆత్మీయ అనుబంధం. అందుకు నిదర్శనం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మోరి నిజరూప వైభవం.
మధ్యప్రదేశ్ ఉజ్జాయిని మహంకాళి మాత.. భక్తుని ప్రార్ధనకు చలించి సికింద్రాబాద్కు తరలి వచ్చారని చెబుతారు. కల్పితం అసలే కాదని.. కళ్లెదుట జరిగిన నిజమని భక్తుల నమ్మకం. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సురటి అప్పయ్య 1813 సంవత్సరంలో అప్పటి బ్రిటీష్ ఆర్మీలో పని చేసేవారు. ఆ సమయంలో హైదరాబాద్-సికింద్రాబాద్లో ప్లేగు వ్యాధి విజృంభించింది. ఉజ్జయినిలో వున్న అప్పయ్య సహచరులతో కలిసి మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. తన ప్రాంత ప్రజలను ప్లేగు బారి నుంచి కాపాడితే సికింద్రాబాద్లో అమ్మోరి గుడి నిర్మిస్తానని మొక్కుకున్నారట. ఆ తర్వాత ఆయన ఉజ్జాయిని నుంచి సికింద్రాబాద్కు తిరిగి వచ్చారు. ప్లేగు వ్యాధి తగ్గిందని తెలుసుకున్నారు.
ఇదంతా అమ్మ దయ అని భావించి 1815లో సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయం భక్తికి శక్తికి కేంద్రంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంది. ఆనాటి నుంచి ప్రతీ ఏటా బోనాలు పండుగ జరుగుతోంది. తెలంగాణ అధికారిక పండుగ. లష్కర్లో ఉజ్జాయిని మహంకాళి బోనాల సంబురం అంబరాన్నంటుతోంది. ఈ వేడుక కోసం రేవంత్ సర్కార్ 25 కోట్ల నిధులను కేటాయించింది. కట్టుదిట్ట భద్రత మధ్య సకల జనులు భక్తితో అమ్మను కొలుస్తున్నారు.