H-1B Visa Fee: హెచ్-1బీ వీసా అప్లికేషన్లపై విధించిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో.. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ వీసాలతో.. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి మరో ఏడాది పాటు ఫీజు వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పైనా సంతకం చేశారు.
సాధారణంగా హెచ్1-బీ వీసా దరఖాస్తుల కోసం అయ్యే ఖర్చును కంపెనీలే భరిస్తాయి. గతంలో దీనికోసం.. 2 నుంచి 5 వేల డాలర్ల వరకూ ఖర్చవగా.. గతేడాది సెప్టెంబరులో ఈ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది ట్రంప్ గవర్నమెంట్. ఈ రూల్ తీసుకొచ్చి ఏడాది పూర్తవుతున్న వేళ.. మరో 12 నెలల పాటు ఈ పెంపుని పొడిగించింది. 2025లో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా.. ఐటీ సేవలను అవుట్సోర్సింగ్ ఇస్తున్న కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లలో 92 శాతం తగ్గుదల నమోదైనట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. దీంతో.. అమెరికన్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటోంది. అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే కంపెనీలు నియమించుకునేలా చూడటం తమ ప్రధాన ఉద్దేశమని ట్రంప్ సర్కార్ చెబుతూ వస్తోంది. అమెరికా హెచ్-1బీ ప్రోగ్రామ్ ద్వారా లబ్ధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు ఫ్రంట్లైన్లో ఉన్నారు. ఇప్పుడు.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్న భారతీయులందరికీ గడ్డుకాలం ఇంకొంతకాలం కంటిన్యూ కానుంది.
అమెరికాలో స్టూడెంట్ వీసాలపై ఉండి.. హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి.. ఈ లక్ష డాలర్ల ఫీజు వర్తించదు. అమెరికా విడిచి వెళ్లకుండా.. ఇప్పటికే ఉన్న వీసాల స్టేటస్ను మార్చుకునేందుకు వచ్చిన దరఖాస్తులకు కూడా ఫీజు నుంచి మినహాయింపు ఉంది. బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తుదారులు మాత్రం.. లక్ష డాలర్లు చెల్లించాల్సిందే. అయితే.. ఈ అంశంపై న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ.. ప్రెసిడెంట్ ట్రంప్ ఫీజు గడువుని మరో ఏడాది పొడిగించడం హాట్ టాపిక్గా మారింది.
Also read: చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ