America- Iran War: ఓ వైపు అమెరికా.. మరోవైపు ఇరాన్.. వీటి మధ్యలో ఇజ్రాయెల్.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. అగ్రరాజ్యం యుద్ధ నౌకలు, సైన్యం ఇరాన్ వైపు కదులుతున్న వేళ.. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయ్. అసలు.. అమెరికా, ఇరాన్పై దాడి చేస్తుందా? ఇజ్రాయెల్ సర్ప్రైజ్ ఎటాక్కు ప్లాన్ చేసిందా?
అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలతో.. ఏం జరుగుతుదోనని ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఇరాన్ అంతర్గత కల్లోలంతో రగులుతుంటే, మరోవైపు అమెరికా తన భారీ యుద్ధ నౌకలను, యుద్ధ విమానాలను, సైన్యాన్ని ఇరాన్ దిశగా కదిలిస్తోంది. వీటన్నింటి మధ్య ఇజ్రాయెల్ సర్ప్రైజ్ ఎటాక్ కోసం సిద్ధమవుతోందనే వార్తలు మరింత ఆందోళన పెంచుతోంది. టెహ్రాన్పై దాడి జరిగితే.. ఇరాన్ తమనే లక్ష్యంగా చేసుకుంటుందనే అంచనాతో, ఇజ్రాయెల్ తన దళాలను హైఅలర్ట్లో ఉంచింది. ఇస్లామిక్ దేశంలో వెల్లువెత్తిన నిరసనల్లో, వేలాది మంది మరణించిన తర్వాత.. ఇరాన్తో ఉద్రిక్తతలు పెరిగాయ్త దాంతో.. మధ్యప్రాచ్యంలో అమెరికా యుద్ధ నౌకని, ఫైటర్ జెట్స్ని తిరిగి మోహరించింది. ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఏ క్షణమైనా యుద్ధం మొదలవ్వొచ్చనే సంకేతాలిచ్చారు. ఇరాన్ కూడా తమపై దాడి గనక జరిగితే.. ఆ ప్రాంతం మొత్తం సైనిక సంఘర్షణలోకి వెళ్లిపోతుందని హెచ్చరించింది.
మధ్యప్రాచ్యంలో కార్యకలాపాలను పర్యవేక్షించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ని కూడా అమెరికా బలోపేతం చేస్తోంది. F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్లని, ఎయిర్క్రాఫ్ట్ క్యారియల్ అబ్రహం లింకన్ని వ్యూహాత్మకంగా ఇరాన్ దగ్గరకు తీసుకొస్తోంది. అంతేకాదు.. మిడిల్ ఈస్ట్లో యూఎస్ తన ఎయిర్, మిసైల్ రక్షణ వ్యవస్థలను కూడా బలోపేతం చేసింది. ఇప్పటికే.. ట్రంప్ కూడా ఇరాన్ వైపు బిగ్ ఫోర్స్ కదులుతున్నట్లు కన్ఫామ్ చేశారు. ఏం జరుగుతుందో చూద్దామన్నారు. అక్కడేమీ జరగొద్దని కోరుకుంటున్నామని, ఇరాన్ని చాలా దగ్గరగా గమనిస్తున్నామని చెప్పారు ట్రంప్. అయితే.. దావోస్లో మాత్రం ఇరాన్పై మిలిటరీ యాక్షన్ అవసరం ఉండదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. తన బెదిరింపుల కారణంగానే.. టెహ్రాన్ 8 వందల మందికి పైగా నిరసనకారుల ఉరిశిక్షలను నిలిపేసిందని తెలిపారు. వారిని ఉరితీస్తే ఇరాన్పై తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గిందన్నారు. ఈ విరామం శాశ్వతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇంటర్నెట్ బ్లాక్ అవుట్, స్టార్ లింక్ సేవలపై ఆంక్షలు విధించినప్పటికీ, ఇరాన్ నుంచి హత్యలు, హింసలకు సంబంధించి భయంకరమైన వివరాలు బయటకొస్తున్నాయ్. ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం.. 500 మంది భద్రతా సిబ్బంది సహా 5 వేల మంది నిరసనకారులు మరణించినట్లు చెబుతున్నారు. మరోవైపు.. అమెరికా ప్రెసిడెంట్పై దాడి చేస్తామని, ఖమేనీ ప్రభుత్వం హెచ్చరించడంతో.. ఈ ప్రాంతం మొత్తం ఉద్రిక్తతలు ఇంకా పెరిగాయ్. ట్రంప్ కూడా ఇరాన్ నుంచి వస్తున్న బెదిరింపులను పెద్ద ఫోర్స్తో ఎదుర్కొంటామని హెచ్చరించారు. తమ దగ్గర చాలా మిలటరీ ఆప్షన్స్ రెడీగా ఉన్నాయన్నారు. అమెరికా సైన్యం, మధ్యప్రాచ్యం అంతటా వేగంగా ఫోర్స్ని మోహరిస్తోంది. ట్రంప్ కూడా నిర్ణయాత్మక దాడి కోసం ప్రెజర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా ఎలాంటి దాడి జరిగినా తీవ్రంగా రియాక్ట్ అవుతుందని హెచ్చరిస్తోంది. ఇరాన్పై యూఎస్ దాడి చేయడం ఖాయమని భావిస్తున్న ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ కూడా హైఅలర్ట్లో ఉంది.
యూఎస్ ఎయిర్ఫోర్స్కి చెందిన 12, F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్లని, యూకే నుంచి జోర్డాన్లోని ఎయిర్బేస్లకు, కేసీ-135 వైమానిక రీఫ్యూయలర్లు, సీ-130 కార్గో విమానాలను మోహరించింది. గత సంవత్సరం ఇరాన్తో జరిగిన 12 రోజుల వివాదంలో.. ఇరానియన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు, F-15E మల్టీరోల్ కాంబాట్ జెట్స్ని.. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించాయ్. F-35C, F/A-18 ఫైటర్ జెట్లతో కూడిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్.. దక్షిణ చైనా సముద్రం నుంచి మలక్కా జలసంధిని దాటింది. అమెరికా ఇప్పటికే తన ఎయిర్ఫోర్స్, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని బలోపేతం చేసింది. ఇజ్రాయెల్, ఖతార్, జోర్డాన్తో సహా మిడిల్ ఈస్ట్ అంతటా అదనపు తాడ్, పేట్రియాట్ మిసైల్ బ్యాటరీలను మోహరించారు. వీటితో పాటు అదనపు వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా పంపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వైట్హౌస్ అధికారిక వర్గాలు తెలిపాయ్. ఇవన్నీ.. ఇరాన్పై వేగవంతమైన, విస్తృతమైన దాడులకోసమేననే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయ్. అయితే.. ఉద్రిక్తతలు, ఘర్షణ మధ్య ఊగిసలాడుతున్న ట్రంప్ మారుతున్న వైఖరి, అమెరికాతో పాటు మధ్యప్రాచ్యంలోనూ అనిశ్చితికి కారణమవుతోంది.
ఇరాన్ విషయంలో ఆ దేశానికి ఎలాంటి నష్టం జరగొద్దని తాను భావిస్తున్నా.. ఇంకా ఉద్రిక్తతలు సద్దుమణగట్లేవన్నారు. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఇక ముందు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ చెబుతున్నారు. రాబోయే రోజుల్లో అమెరికాకు చెందిన అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, ఇతర సైనిక దళాలు ఇరాన్కు దగ్గరగా చేరుకోనున్నాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయ్. ట్రంప్ విధానం, బలవంతపు ఒత్తిడితో కూడిన వ్యూహాత్మక చర్యలనే చర్చ జరుగుతోంది. ఇది యుద్ధానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇరాన్పై భారీ స్థాయిలో దాడి చేయాలని అమెరికా డిసైడ్ అయితే గనక.. F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు, B-2 బాంబర్లు అవసరం. వీటిని ఇంకా ఆ ప్రాంతంలో మోహరించలేదు. కానీ, ట్రంప్ హెచ్చరికలు, మిడిల్ ఈస్ట్లో అమెరికా సైనిక మోహరింపు లాంటివన్నీ.. మిలటరీ యాక్షన్కు అవకాశం ఉందని సూచిస్తున్నాయ్.
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ మేఘాలతో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. ఇరాన్పై దాడి జరిగితే.. టెహ్రాన్ తమనే టార్గెట్ చేస్తుందనే ఆలోచనతో ఉంది. అందుకోసమే.. ముందుగానే అన్నింటికీ సిద్ధమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తే.. ఇరాన్ తట్టుకోగలదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం తప్పదా? అమెరికా ఇప్పుడు కూడా భయపెట్టి వదిలేస్తుందా? యుద్ధ బరిలో దిగుతుందా?
తమ దేశంపై దాడి జరిగితే.. అమెరికా స్థావరాలతో పాటు ఇజ్రాయెల్ని కూడా మ్యాప్ నుంచి తుడిచేస్తామని హెచ్చరిస్తోంది. తమకు ముప్పు ఉందని భావిస్తే.. శత్రువు దాడి చేసే దాకా వేచి చూడబోమని, తామే ముందుగా విరుచుకుపడతామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రకటించింది. అంతేకాదు.. యుద్ధం గనక వస్తే.. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ సంకేతాలిస్తోంది. తాజా పరిణామాలు, ఉద్రిక్తలతో.. ఇజ్రాయెన్ డిఫెన్స్ ఫోర్స్ ఇప్పటికే హై అలర్ట్లో ఉంది. ఇజ్రాయెల్ కేవలం రక్షణకే పరిమితం కాకుండా, ఇరాన్పై సర్ప్రైజ్ సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయ్. ప్రధానంగా.. ఇరాన్ దాడి భయంతో.. ఇజ్రాయెల్ యుద్ధ బాటలోకి దిగుతోంది. 2025 జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధం తర్వాత.. ఇరాన్ తన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని తిరిగి నిర్మించుకుంటోంది. ఇది.. తమ మనుగడకే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అమెరికా మద్దతుతో, ఇరాన్లోని ప్రధాన అణు, క్షిపణి కేంద్రాలను ఒకేసారి దెబ్బకొట్టాలని ఇజ్రాయెల్ చూస్తోంది.
ఇరాన్పై అమెరికా దాడి జరుగుతుందనే ఆందోళనల మధ్య ఇజ్రాయెల్ అలర్ట్ అయింది. అమెరికా దళాలు ఇరాన్ వైపు కదలడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పోలీసు, అగ్నిమాపక, అత్యవసర సేవలతో సహా సైనిక, పౌర సంస్థలన్నీ.. దాడుల తర్వాతి పరిస్థితులకు సిద్ధమవుతున్నాయి. అమెరికా నిర్ణయం ఏదైనా, తక్కువ సమయంలోనే తమపై దాడి జరిగితే, అందుకు తగ్గట్లుగా తాము కూడా ప్రతిదాడి చేయాలనే ఆలోచనతో ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ కూడా హైఅలర్ట్లో ఉంది. ఇరాన్ గనక దాడి చేస్తే.. ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. అమెరికా దాడి చేస్తే గానీ.. ఇరాన్, ఇజ్రాయెల్ని లక్ష్యంగా చేసుకోకపోవచ్చనే చర్చ జరుగుతోంది. అయితే.. తమపై దాడులు జరిగితే మాత్రం ఇజ్రాయెల్, యూఎస్ స్థావరాలను టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. దాంతో.. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ డిఫెన్స్ అధికారులు చెబుతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం వస్తుందా? లేదా? అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ స్టైల్ ఎప్పుడూ.. భయపెట్టి చర్చలకు తీసుకురావడమే. ఆయన స్వయంగా తన సైన్యాన్ని ఉపయోగించాల్సిన అవసరం రాకపోవచ్చనే చర్చ ఉంది. ఇరాన్తో చర్చల కోసమే.. మ్యాగ్జిమమ్ ప్రెజర్ తెస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సైన్యం మోహరింపు కూడా హెచ్చరికే. ఇరాన్ ఒకవేళ తన అణచివేతని ఆపి, చర్చలకు సిద్ధమైతే యుద్ధం తప్పుతుంది. లేకపోతే.. చిన్న నిప్పురవ్వ కూడా పెద్ద యుద్ధానికి దారితీయొచ్చు. అమెరికా దాడి చేస్తే, ఇరాన్ తనపై ప్రతీకారం తీర్చుకుంటుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే తన గగనతల రక్షణ వ్యవస్థలైన ఐరన్ డోమ్, ఆరో ని హై అలర్ట్లో ఉంచింది. యుద్ధమంటూ సంభవిస్తే.. అది కేవలం ఆ దేశాలకే కాదు, ప్రపంచం మొత్తానికి నష్టం. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయ్. ఆర్థికమాంద్యం వచ్చే ప్రమాదముంది. ప్రస్తుతానికి.. అమెరికా భయపెట్టే వ్యూహంలోనే ఉంది. ఇరాన్ గకన వెనక్కి తగ్గకపోతే, సర్జికల్ స్ట్రైక్స్, పరిమితమైన దాడులు జరిగే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
ఇరాన్పై.. అమెరికా దాడి చేస్తుందా? లేదా? అనేది.. ట్రంప్ తదుపరి అడుగుపై ఆధారపడి ఉంది. చర్చలకు అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో సైనిక మోహరింపులు మాత్రం.. విధ్వంసానికి సిద్ధమన్నట్లుగా ఉన్నాయ్. ఇరాన్ గనక, తన దూకుడు తగ్గించకపోతే.. మధ్యప్రాచ్యంలో మరో భారీ యుద్ధం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయ్.
Story by: Anup, Big Tv