AP Politics: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఈడీ) విచారణకు హాజరైన వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయడంతో పాటు, వైసీపీ అధ్యక్షుడు జగన్ చుట్టూ ఉన్న కోటరీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని, ఆ కోటరీ మాటలు నమ్మితే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చిచెప్పారు. ఆ క్రమంలో విజయసాయి కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి.
ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందన్న అనుమానాలతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చిన ఈడీ ఆయన్ని విచారించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో విజయసాయిరెడ్డిని ఏ5 నిందితుడిగా చేర్చింది. గతేడాది మేలో మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేయగా, ఇప్పుడు విచారణను ముమ్మరం చేసింది.
ఈడీ విచారణకు హాజరైన తర్వాత విజయసాయిరెడ్డి వైసీపీలోని కోటరీతో పాటు జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయంపై యూ-టర్న్ తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. తనను విమర్శిస్తున్న జగన్ అలాగే తనను ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో తాను తట్టుకుని ముందుకు సాగాలంటే కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని తాను వస్తాను అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి అన్నది తొందరలోనే చెబుతాను అని ఆయన అన్నారు. అది జనసేననా లేక బీజేపీనా ఏది అన్నది పూర్తి వివరాలు అపుడే ఇస్తాను అని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం.
లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ అధికారులు తనను ప్రశ్నించారని, అయితే అసలు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని తాను భావించడం లేదని అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. మిథున్ రెడ్డి కోరిక మేరకు శ్రీధర్ రెడ్డి కంపెనీకి సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, కానీ రూ.100 కోట్లు ఏర్పాటు చేయాలని జగన్ తనతో ఎన్నడూ చెప్పలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా జగన్ చుట్టూ ఉన్న కోటరీపై విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ చుట్టూ ఉన్న కోటరీ పెట్టే వేధింపులు, అవమానాలు తట్టుకోలేకపోయానని, ఆ కోటరీయే తనను పొగబెట్టి నెమ్మదిగా పార్టీ నుంచి బయటకు పంపించిందని మండిపడ్డారు. . కోటరీలోని కొందరు ఇప్పటికీ తింటూనే ఉన్నారని, జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు ఇప్పుడు గౌరవం లేకుండా పోయిందని, ఈ కోటరీ మాటలు నమ్ముతూ, వారి సలహాలే ఫాలో అయితేజగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను వైసీపీలో ఉన్నప్పుడు నెంబర్ -టూ2గా ఉన్నానన్న మాట వాస్తవమేనని, కానీ కేవలం తనపై కేసులు వచ్చినప్పుడు, వాటిని ఎదుర్కోవడానికి మాత్రమే తనను నంబర్ 2గా ప్రచారం చేశారని వాపోయారు. కానీ లాభాలు పంచుకోవడంలో మాత్రం తన స్థానం వంద తర్వాతనే అని చెప్పుకొచ్చారు. తాను ప్రలోభాలకు లొంగిపోయాయని గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకుంటేనే తదుపరి ఆలోచన ఉంటుందని షరతు విధించారు.
జగన్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తన చుట్టూ కోటరీని తెంచుకుని బయటపడాలని విజయసాయిరెడ్డి సూచించారు. లేదా కూటమి చీలిపోతేనే జగన్ కి అధికారం దక్కే అవకాశముందని విశ్లేషించారు.. అయితే వైసీపీలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా ఫలితం ఉండదని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. తనకు విశాఖలో ఒక అపార్ట్మెంట్ తప్ప మరేమీ లేదని, ఏడాదిగా వ్యవసాయం చేసుకుంటున్నానని, సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తమ్మీద విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Story by: Apparao, Big Tv