తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ప్రత్యర్థులపైనే కాకుండా.. సొంత పార్టీ నేతలపై కూడా జరిగిందని ఆయన పేర్కొనడం గమనార్హం.
మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే ఈ అక్రమ ట్యాపింగ్ పర్వం కొనసాగిందని ఆరోపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావు, కవితల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. బయటి వ్యక్తులనే కాకుండా, తమ సొంత కుటుంబ సభ్యులను, పార్టీ ముఖ్యులను కూడా నమ్మకుండా నిఘా పెట్టడం వారి నియంతృత్వ ధోరణికి నిదర్శనమని విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియకు సంబంధించి దేశంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. సాధారణంగా దేశ భద్రత లేదా అత్యవసర పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ (CS) అనుమతి లేకుండా ఎవరి ఫోన్లను ట్యాప్ చేయడానికి వీలు లేదని.. కానీ గత పాలకులు ఆ నియమాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, సొంత నిర్ణయాలతో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేశారని వివేక్ ధ్వజమెత్తారు.
మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు
హరీష్ రావు, కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి
ట్యాప్ చేయించింది కేసీఆర్,కేటీఆరే
చీఫ్ సెక్రటరీ అనుమతి లేకుండా ఫోన్లు ట్యాప్ చేయకూడదు
వీళ్లు మాత్రం సొంత నిర్ణయాలు తీసుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసి ఫోన్లు ట్యాప్ చేశారు
ఇల్లీగల్… pic.twitter.com/Rr5ec9EUJJ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2026
ఈ అక్రమ కార్యకలాపాల్లో భాగస్వాములైన అధికారులను విడిచిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి హెచ్చరించారు. చట్టానికి వ్యతిరేకంగా పాలకుల మెప్పు కోసం పనిచేసిన అధికారులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం నేరమని, ఇలాంటి ఇల్లీగల్ పనులకు పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ కుంభకోణానికి సంబంధించి మరిన్ని నిజాలు బయటకు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ALSO READ: KCR: గులాబీ బాసుతో కేటీఆర్ భేటీ.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న కేసీఆర్