AP Elections: ఆ వైసీపీ పెద్దాయన జమిలీ ఎన్నికల జపం చేస్తున్నారు. 2027 ఫిబ్రవరిలోనే మళ్లీ ఎన్నికలు వస్తాయని.. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని చెబుతున్నారు. అంతేనా.. ఇదే విషయంపై ఓ కేంద్ర మంత్రి నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిందని అంటున్నారు. ఇంతకీ ఆయన ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు..? కార్యకర్తల్లో ఉత్తేజం నింపడమే ఆ పెద్దాయన వ్యూహమా లేదంటే కూటమి పార్టీలతో మైండ్ గేమ్ ఆడడమే లక్ష్యమా..?
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీమంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..! ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత గౌరవం ఇచ్చే నాయకుల్లో టాప్లో ఉంటారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇలాంటి నేత సడెన్గా సంచలన వ్యాఖ్యలే చేశారు. 2027 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని బాంబు పేల్చారాయన. ఇందుకోసం వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి. అయితే.. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న విషయం కాదన్నారు పెద్దిరెడ్డి. స్వయంగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషే ఈ మేరకు చెప్పారని వెల్లడించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పైగా కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారంటూ పెద్దిరెడ్డి చెప్పడం హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు.. మళ్లీ రాజకీయ వర్గాల్లో జమిలీపై చర్చ మొదలైంది.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు అలా మాట్లాడారు..?
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అయితే.. సార్వత్రిక ఎన్నికలు పూర్తైన కొన్ని రోజుల తర్వాత నుంచి రాష్ట్రంలో జమిలీ నామస్మరణ మొదలైంది. అవకాశం వచ్చినప్పుడల్లా జమిలీ ఎన్నికలు 2027లో రాబోతున్నాయంటూ ప్రకటనలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఇలాంటి వేళ పార్టీలో పెద్దాయనగా గుర్తింపు పొందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఇలాంటి కామెంట్లు రావడం చాలా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసలు పెద్దిరెడ్డి ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న డిస్కషన్స్ అప్పుడే జోరందుకున్నాయి. అయితే.. ఇక్కడే రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకుల. ఎన్నికల్లో ఘోర పరాజయం చెందడం వైసీపీని సహజంగానే నిరుత్సాహానికి గురిచేసింది. అయితే.. రాష్ట్రంలో కూటమి పార్టీకి తిరుగులేని మెజార్టీ ఉండడంతో వలసలు సర్వ సాధారణమే. అయితే.. క్షేత్రస్థాయిలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు, క్యాడర్లో నైతిక స్థైర్యం నింపేందుకే స్వయంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చన్న మాట విన్పిస్తోంది.
కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే వ్యూహమా..?
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తోంది వైసీపీ. గత వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరికీ తాము ఎన్నో సంక్షేమ పథకాలు అందించగా.. ఇప్పుడు వాటిలో కొన్నింటిని కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని స్వయంగా ఆ పార్టీ అధినేత జగన్ సైతం ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, ప్రతిపక్షంలో ఉన్నామన్న భావన సాధ్యమైనంతగా తగ్గించేందుకు మాత్రమే కాకుండా కూటమిపై ఒత్తిడి పెంచేందుకు ఇలాంటి కామెంట్లు చేసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జమిలీ ఎన్నికల గురించి వైసీపీ నేతలు ఇలా కామెంట్ చేయడం ద్వారా తమకు రెండు లాభాలు కలుగుతాయని భావిస్తున్నట్లుగా సమాచారం. వాటిలో ఒకటి పార్టీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఎవరూ టీడీపీ-జనసేన-బీజేపీ నేతృత్వంలోని కూటమి వైపు వెళ్లకుండా ఉంటారు. మరోటి.. ఇప్పటికే అధికారంలో ఉన్న కూటమి పార్టీ ఎమ్మెల్యేలపై పథకాల అమలు విషయంలో ఒత్తిడి పెరుగుతుందన్నది మరో రీజన్. ఇలా ఏది చూసినా తమకే ఎడ్జ్ అని భావిస్తోంది వైసీపీ.
2027లో జమిలీ ఎన్నికలు నిజంగానే వస్తాయా..?
పెద్దిరెడ్డి కావచ్చు.. లేదంటే మరో వైసీపీ నేత కావచ్చు.. ఎవరి కామెంట్లనైనా పక్కన పెడితే జమిలీ ఎన్నికలు 2027లో వచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే అదంత సులువేం కాదన్న మాట విన్పిస్తోంది. ఇప్పటికే జనగణనకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణనలోనే కులగణన చేపట్టాలని ఆదేశించింది. ఇందుకోసం షెడ్యూలు సైతం ప్రకటించింది నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు. జనగణన, కులగణన పూర్తి చేసి, పార్లమెంటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే సరికి చాలా సమయం పడుతుంది. పైగా నియోజకవర్గాల పునర్విభజన అంశం ఎలాగూ ఉంది. ఆ ప్రకారం చూస్తే ఏదైనా అద్భుతం జరిగి చకచకా పరిణామాలు జరిగితే తప్పించి.. 2029 వరకు జమిలీ వచ్చే అవకాశామే లేదన్నది ఎక్కువ మంది చెప్పేమాట.
Also Read: డీఎస్ ఎవరి సొంతం..?
ఇవన్నీ ఆలోచించి, విశ్లేషించి చూస్తే కార్యకర్తలు, నేతలను ఇతర పార్టీల వైపు వెళ్లకుండా నిలువరించడం, ప్రత్యర్థి పార్టీలపై మైండ్ గేమ్ ఆడడం లక్ష్యంగా వైసీపీ నేతలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారన్న వాదన బలంగా విన్పిస్తోంది.