Women Reservation: ఈ దేశ రాజకీయ చరిత్రలో.. అత్యంత సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కీలక బిల్లు ఏదైనా ఉందీ అంటే.. అది మహిళా రిజర్వేషన్ బిల్లే. 1996లో తొలిసారి పార్లమెంట్ మెట్లు ఎక్కిన ఈ బి్ల్లు.. చట్టరూపం దాల్చడానికి 27 ఏళ్లు పట్టింది. 2023లో నారీ శక్తి వందన్ అధినియం పేరుతో.. మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఇది జరిగిన మూడేళ్ల తర్వాత.. ఈ ఏప్రిల్ 16 నుంచి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం, నిన్నటి నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 16, 2026ని.. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు తేదీగా ప్రకటిస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం.
మహిళా రిజర్వేషన్ బిల్లు భారత పార్లమెంట్లో తొలిసారి 1996, సెప్టెంబర్ 12న ప్రవేశపెట్టారు. అప్పటి ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. 81వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కేటాయించే సదుద్దేశంతో ఈ బిల్లుని తీసుకొచ్చినా, రాజకీయ ఏకాభిప్రాయం లేకపోవడంతో ఆమోదం పొందలేదు. ఆ తర్వాత 1998, 1999, 2008 సంవత్సరాల్లోనూ అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టాయి. 2010లో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినా, లోక్సభలో నిలిచిపోయింది. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత, 2023 సెప్టెంబర్లో ఎన్డీయే ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం పేరుతో.. ఈ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి విజయవంతంగా ఆమోదింపజేసింది.
మహిళా రిజర్వేషన్ల డిమాండ్, ఎదురైన అడ్డంకులు, అమలులో ఆలస్యానికి అనేక కారణాలున్నాయ్. మహిళలకు రాజకీయాల్లో ప్రాధాన్యత ఉండాలనే చర్చ దశాబ్దాలుగా ఉంది. అయితే, 1990ల్లోనే దీనికొక బలమైన పునాది పడింది. 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రభుత్వం.. 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లని తీసుకొచ్చింది. 1993 ఏప్రిల్ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. 1994లో జరిగిన అనేక రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో తొలిసారి మహిళా రిజర్వేషన్లు అమలయ్యాయి. కాలక్రమేణా చాలా రాష్ట్రాలు ఈ కోటాను 50 శాతానికి పెంచాయ్. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో.. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయ్.
Also Read: విడాకుల విషయంలో పశ్చాత్తాపం లేదు.. సంతోషంగా ఉన్నా.. ఫస్ట్ టైం స్పందించిన హన్సిక!
స్థానిక సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడంతో, ఇదే స్పూర్తిగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు వర్తింపజేయాలనే డిమాండ్ బలంగా వినిపించడం మొదలైంది. అలా.. మహిళా రిజర్వేషన్ బిల్లు.. పార్లమెంటులో అనేకసార్లు అగ్నిపరీక్షను ఎదుర్కొంది. తొలిసారి 1996లో రాజకీయ ఏకాభిప్రాయం లేక సభ ఆమోదం పొందలేదు. 1998, 1999 ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రెండుసార్లు బిల్లుని ప్రవేశపెట్టినా, తీవ్ర నిరసనల మధ్య వీగిపోయింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ఈ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందినా, లోక్సభలో ఓటింగ్కు రాకుండానే ఆగిపోయింది. అలా, 27 ఏళ్ల తర్వాత 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది.
దాదాపు 3 దశాబ్దాల పాటు మహిళా రిజర్వేషన్ అమల్లోకి రాకపోవడానికి అనేక రాజకీయ, సామాజిక కారణాలున్నాయ్. అనేక ప్రాంతీయ పార్టీలు.. ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించాయ్. 33 శాతం రిజర్వేషన్లలో ఓబీసీ, మైనారిటీ మహిళలకు ప్రత్యేక కోటా ఉండాలని పట్టుబట్టారు. అలా లేకపోతే, కేవలం అగ్రవర్ణ మహిళలకే ప్రయోజనం జరుగుతుందనే వాదనలు వినిపించారు. పురుషాధిక్య ధోరణి కూడా ఆలస్యానికి కారణంగా కనిపిస్తోంది. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే, ప్రస్తుతమున్న పురుష నేతలు తమ సీట్లను కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన కూడా ఓ కారణమనే ప్రచారం ఉంది. ఇక, 1990ల్లో ఉన్న రాజకీయ అస్థిరత మరో కారణం. అప్పట్లో.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉండేవి. సర్కార్కు మద్దతు ఇస్తున్న పార్టీలు ఈ బిల్లుపై అసంతృప్తి, అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. ప్రభుత్వం పడిపోతుందనే భయంతో అప్పట్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో ఆమోదం పొందినప్పటికీ, వెంటనే అమల్లోకి రాలేదు. ఇందుకు రెండు నిబంధనలు అడ్డంకిగా మారాయి. కోవిడ్ కారణంగా ఆగిపోయిన జనాభా లెక్కలు పూర్తి కావాలి. అదేవిధంగా కొత్త సెన్సన్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఏయే సీట్లు మహిళలకు కేటాయించాలనేది ఈ డీలిమిటేషన్ ద్వారానే తేలుతుంది. అందుకోసమే, కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు, డీమిలిటేషన్ని లింక్ పెట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఏదేమైనా, సుదీర్ఘ కాలం తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడమనేది.. భారత ప్రజాస్వామ్యంలో ఓ చారిత్రక ఘట్టం. ఇది కేవలం చట్టసభల్లో మహిళల సంఖ్యని పెంచడమే కాదు, విధాన నిర్ణయాల్లో మహిళల పాత్రకు ఓ గుర్తింపునిస్తుంది. అమల్లో ఆలస్యమైనప్పటికీ, చివరకు భారత నారీ శక్తికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు దక్కింది.