Guntur Mayor Issue: ఉన్న పదవికి రాజీనామా చేస్తే.. ప్రశంసలు వస్తాయనుకున్నారు. ఈ పదవి పోతే.. మరో పోస్టు వెతుక్కుంటూ వస్తుందని లెక్కలేసుకున్నారు. హైకమాండ్ గుర్తించి ఓ పదవి ఇస్తే.. జిల్లాలో పార్టీని పరుగులు పెట్టిద్దామనుకున్నారు. కానీ.. మనోహర్ నాయుడు లెక్క తప్పింది. అధిష్టానం అంచనాలు కూడా తారుమారయ్యాయ్. రిజైన్ చేసి.. పార్టీ డిజైన్ మారుద్దామనుకున్న నాయకుడికి పెద్ద చిక్కే వచ్చిపడింది. తాను తీసుకున్న నిర్ణయంతో.. అటు అధిష్టానానికి, ఇటు లోకల్ లీడర్లకు దూరమయ్యారు. అసలు.. మనోహర్ నాయుడు భవిష్యత్ ఏంటి?
రిజైన్.. నాట్ రీజనబుల్!
మనోహర్ నాయుడు రాజీనామాతో ఊహించని పరిణామాలు
గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి.. వైసీపీ నేత మనోహర్ నాయుడు రాజీనామా చేయడం, తాత్కాలిక మేయర్గా.. డిప్యూటీ మేయర్ షేక్ సజీలా నియామకం అందరికీ తెలిసిందే. అయితే.. మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయడంతో.. వైసీపీలో ఊహించని పరిణామాలకు దారితీసిందట. ఆయన రాజీనామా అంశంపైనే ప్రస్తుతం పార్టీలో అంతర్గతంగా పరిస్థితుల్ని మార్చేసిందట. ఇందుకు కారణం.. మనోహర్ నాయుడి రాజీనామాకు రెండు రోజుల ముందు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి..
జగన్ హామీ ఇచ్చిన 2 రోజులకే మనోహర్ రాజీనామా
గుంటూరు కార్పొరేటర్లను తన ఆఫీసుకు పిలిపించుకొని మాట్లాడారట. ధైర్యంగా పోరాడండి.. మీకు మా సపోర్ట్ ఉంటుందనే హామీ ఇచ్చి పంపించారట. ఆయన హమీ ఇచ్చి పంపిన రెండు రోజులకే.. మనోహర్ నాయుడు మేయర్ పదవికి రాజీనామా చేయడం, అది కూడా కార్పొరేటర్లకు ఎవరికీ చెప్పకపోవడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. స్థానికంగా ఉన్న ముఖ్య నేతలకు సైతం ఈ అంశాన్ని తెలియజేయకుండా.. తనకు తానే సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై.. మనోహర్ నాయుడు తీరుపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ నడుస్తున్నట్లు తెలుస్తోంది.
రాజీనామా తర్వాత సైలెంట్ అయిపోయిన మనోహర్
రాజీనామా తర్వాత మనోహర్ నాయుడు ఎక్కడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం గానీ.. కార్పొరేటర్తో కలవడం గానీ, అధిష్టానం దగ్గరకు వెళ్లి కలవడం గాని జరగలేదు. దాంతో.. రాజీనామా అంశంలో అటు హైకమాండ్కు చెప్పకుండా, స్థానిక నాయకత్వానికి తెలియజేయకుండా నిర్ణయం తీసుకోవడంపై.. జగన్ కూడా మనోహర్ నాయుడిపై ఆగ్రహంగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. రాజీనామా చేసి తన పదవిని తాను వదులుకున్న పరిస్థితుల్లో అధిష్టానం నుంచి ప్రశంసలు వస్తాయనే లెక్కలేసుకున్న మనోహర్ నాయుడికి.. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు మింగుడుపడటం లేదనేది స్థానిక రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ.
జిల్లా స్థాయిలో పార్టీలో కీలక పదవిని ఆశించిన మనోహర్
మేయర్ పదవికి రాజీనామా చేసి.. గుంటూరు జిల్లాకు సంబంధించి వైసీపీలో కీలకమైన పదవి తీసుకొని.. పార్టీ తరఫున దూకుడుగా ముందుకెళ్దామనే ఆలోచన.. మనోహర్ నాయుడు చేశారని ఆయన అనుచరగణాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే.. ఇప్పటివరకు మనోహర్ నాయుడితో అధిష్టానం చర్చలు జరపకపోవడంతో.. భవిష్యత్ కార్యాచరణ ఏమిటనే దానిపై ఆయన వర్గం సందిగ్ధంలో పడిందట.
మేయర్గా ప్రభుత్వంపై పోరాటం చేసుంటే బాగుండేదన్న చర్చ
అధిష్టానం డైరెక్షన్లో మనోహర్ నాయుడు కొన్నాళ్ల పాటు మేయర్ పదవిలో ఉండి.. కూటమి ప్రభుత్వంపై పోరాటం చేసుంటే బాగుండేదన్న చర్చ.. గుంటూరు వైసీపీలో అంతర్గతంగా నడుస్తోంది. అనేక మంది కార్పొరేటర్ల వాయిస్ కూడా ఇదే మాట అంటున్నారట. రాజీనామా నిర్ణయాన్ని కూడా కొందరు కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారట. అసలు.. అవిశ్వాసం పెట్టిన కూటమి ప్రభుత్వం దగ్గర ఉన్న సభ్యుల సంఖ్యకి.. అవిశ్వాసానికి అవకాశమే లేదనేది వారి వాదన. తామంతా..
Also Read: భారత్ యుద్దం చేస్తే.. పాక్ తట్టుకోగలదా?
నడిపించే నాయకుడే రాజీనామా చేయడమేంటనే చర్చ
అధినేత జగన్కు ఇచ్చిన మాటప్రకారం స్ట్రాంగ్గా నిలబడి పోరాటానికి సిద్ధమవుతున్న సమయంలో.. తమను నడిపించే నాయకుడే రాజీనామా చేయడమేంటని అంతా ఫీలవుతున్నారట. పైగా.. తమకు చెప్పకుండా రాజీనామా చేయడం.. తమనెంతగానో కలచివేసిందని.. ముఖ్యనేతలందరి ముందు కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారట. చిన్న వ్యవహారం.. చినిగి చాటంత అవడంతో.. మనోహర్ నాయుడి రాజకీయ జీవితం సందిగ్ధంతో పడిందనేది ఆయన వర్గంలో వినిపిస్తున్న మరో మాట.
కొత్త పదవి ఎప్పుడొస్తుందో అస్సలు తెలియదు!
ఉన్న మేయర్ పదవికి రాజీనామా చేశారు. కొత్త పదవి ఎప్పుడొస్తుందో అస్సలు తెలియదు. నిజానికి.. వైసీపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పార్టీ పదవుల్లో కూడా అవకాశం కష్టమనే ఆలోచన మనోహర్ నాయుడు వర్గంలో కనిపిస్తోంది. పదవి కంటే ముందు.. అధిష్టానం కూల్ అవ్వాలి. అలా జరగాలంటే.. ముందు ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకోవాలి. వైసీపీ జిల్లా అధ్యక్షులు రాంబాబు సైతం మనోహర్ నాయుడిపై గుర్రుగా ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. దాంతో.. ప్రస్తుతానికైతే.. మనోహర్ రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.