ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం భారతీయ వంట గదిపై ఎఫెక్ట్ పడుతోంది. ముడి చమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయాల వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంటగ్యాస్ ధరలను భారీగా పెంచాయి. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరపై ఏకంగా రూ. 60 అదనపు భారాన్ని మోపాయి. పెరిగిన ఈ ధరలు మార్చి 7వ తేదీ నుంచే అమలులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశ రాజధాని నగరం ఢిల్లీలో సిలిండర్ ధర రూ.913కు చేరుకోగా.. ముంబైలో రూ.912.50, కోల్కతాలో రూ. 939, చెన్నైలో రూ. 928.50, హైదరాబాద్ లో రూ.965 వద్ద వద్ద కొనసాగుతున్నాయి. స్థానిక పన్నులు, వ్యాట్ ప్రభావంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈ రేట్లు మారుతున్నాయి. గత పదకొండు నెలల కాలంలో గ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
హోటల్, రెస్టారెంట్లు.. వాణిజ్య అవసరాల కోసం వాడే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ల పరిస్థితి మరింత భారంగా మారింది. వీటిపై మార్చి నెల ప్రారంభంలోనే రూ.114.5 చొప్పున పెంపుదల కనిపించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఒక కమర్షియల్ సిలిండర్ ఖరీదు రూ. 1,883కు చేరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రం ఊరటను కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 10 కోట్ల మంది పేద వర్గాల వినియోగదారులకు పాత ధరలే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరాలో మార్పుల వల్లే ఈ ధరల సర్దుబాటు తప్పలేదని చమురు సంస్థలు పేర్కొంటున్నాయి.
సరఫరాలో అంతరాయానికి ప్రధాన కారణం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ వ్యూహాత్మక మార్గాన్ని నియంత్రిస్తోంది. ప్రపంచ ఇంధన వినియోగంలో ఐదో వంతు వాటా ఈ మార్గం గుండానే సాగుతుంది. ఖతార్ వంటి దేశాల నుంచి వచ్చే గ్యాస్ ఎగుమతులకు ఇదే ప్రధాన రహదారి. భారత్ ఏటా సుమారు 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీని వినియోగిస్తుండగా.. అందులో 62 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ దిగుమతులు ప్రధానంగా ఈ జలసంధి నుంచే వస్తాయి కాబట్టి భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
గ్యాస్ కొరత ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం విద్యాలయాలు, ఆసుపత్రులకు ప్రాధాన్యత ఇస్తూ కమర్షియల్ సిలిండర్ల సరఫరాపై తాత్కాలిక పరిమితులు విధించింది. దీంతో బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లోని రెస్టారెంట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరంతర సరఫరా లేకపోతే పని గంటలు తగ్గించడం లేదా మెనూలో మార్పులు చేయడం మినహా మరో మార్గం లేదని వారు చెబుతున్నారు. గ్యాస్ కొరత వల్ల స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్ల సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో గ్యాస్ నిల్వలు దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గ్యాస్ బుకింగ్ ఇంటర్వెల్ సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. అంటే వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత రెండోది బుక్ చేసుకోవడానికి 25 రోజుల సమయం వేచి చూడాలి. అదేవిధంగా దేశీయ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని ఆదేశాలు జారీ చేసింది. కమర్షియల్ వినియోగదారుల కంటే గృహ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయిల్ కంపెనీలకు సూచించింది. బ్లాక్ మార్కెట్ తరలకుండా నిఘా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.