FSSAI Ban Whiskey| భారతీయ ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు చెందిన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసింది. ల్యాబ్ టెస్టుల్లో కొన్ని ఉత్పత్తుల్లో ఆర్టిఫీయల్ ఫేవరింగ్ ( కృత్రిమ ఫ్లేవర్) పదార్థాలు ఉన్నట్లు గుర్తించిన తర్వాత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పదార్థాలు ప్రస్తుతం అమల్లో ఉన్న తయారీ ప్రమాణాలకు అనుగుణంగా లేవని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. నిషేధిత బ్రాండ్లలో ఓల్డ్ మాంక్, రాయల్ చాలెంజ్, బ్యాగ్పైపర్, యాంటిక్విటీ బ్లూ బ్రాండ్లకు చెందిన కొన్ని వేరియంట్లు ఉన్నాయి.
మధ్యప్రదేశ్లో యునైటెడ్ స్పిరిట్స్ తయారు చేసిన యాంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ చాలెంజ్ విస్కీ సేల్స్ నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించింది. అలాగే మధ్యప్రదేశ్లో ఇన్బ్రూ బెవరేజెస్ తయారు చేసిన బ్యాగ్పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ XXX రమ్ కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. మహారాష్ట్రలో మోహన్ రాకీ స్ప్రింగ్వాటర్ తయారు చేసిన ఓల్డ్ మాంక్ మూడు వేరియంట్ల విక్రయాలపై కూడా నిషేధం విధించారు. అయితే ఈ నిషేధం ఆయా తయారీ యూనిట్లకే పరిమితమా లేదా దేశవ్యాప్తంగా వర్తిస్తుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
నిబంధనల ప్రకారం.. మద్యం తయారీలో సహజ ఫ్లేవరింగ్ పదార్థాలనే ఉపయోగించాలి. అయితే పరీక్షల్లో కొన్ని ఉత్పత్తుల్లో బయటి నుంచి కృత్రిమ ఫ్లేవర్లను కలిపినట్లు గుర్తించినట్లు ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది. అందుకే పరీక్షించిన ఉత్పత్తులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని, సబ్స్టాండర్డ్ ఉత్పత్తులుగా గుర్తించింది.
ఈ నిర్ణయంపై పూర్తి వివరాలను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇంకా వెల్లడించలేదు. యునైటెడ్ స్పిరిట్స్, ఇన్బ్రూ బెవరేజెస్, మోహన్ రాకీ స్ప్రింగ్వాటర్ సంస్థలు కూడా వెంటనే స్పందించలేదు. అధికారిక ప్రకటనలు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం మద్యం పరిశ్రమలో చర్చకు దారితీసింది. కొందరు పరిశ్రమ ప్రతినిధులు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఇలాంటి ఫ్లేవరింగ్కు అనుమతి ఉందని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం
ప్రపంచంలోని అతిపెద్ద మద్యం మార్కెట్లలో భారత్ ఒకటి. ప్రతి ఏడాది ఈ రంగంలో భారీ ఆదాయం నమోదవుతోంది. యునైటెడ్ స్పిరిట్స్ దేశంలో అతిపెద్ద మద్యం కంపెనీలలో ఒకటి. ఈ నిషేధానికి గురైన బ్రాండ్లు తక్కువ ధరలో అందుబాటులో ఉండటంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి.
ఇటీవల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆహార, పానీయ రంగాలపై తన తనిఖీలను మరింత కఠినతరం చేసింది. అధిక కెఫిన్ ఉన్న కొన్ని పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్స్’గా ప్రచారం చేయవద్దని కూడా ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తాజా చర్యతో తయారీ సంస్థలు తమ ఉత్పత్తి విధానాలను మరోసారి సమీక్షించే అవకాశం కనిపిస్తోంది.
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీ పెరిగేది అప్పుడే.. 8వ పే కమిషన్ అప్డేట్ ఇదిగో