900 Billion AI Agents| ఒకప్పుడు మనుషులు మాత్రమే నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు ఆ పనిని కృత్రిమ మేధస్సు కూడా వేగంగా చేపడుతోంది. భవిష్యత్తులో ఈ మార్పు మరింత భారీ స్థాయికి చేరుకోవచ్చని ఓ కొత్త నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం.. ఇప్పుడు అందరూ ఇష్టపడే ఏఐ వల్ల మానవాళికి తీవ్ర సంక్షోభం రానుంది. మానవ జనాభా కంటే 100 రెట్లు ఎక్కువ సంఖ్యలో ఏఐ ఏజెంట్లు పెరుగుతారని ఇదంతా అతి సమీప భవిష్యత్తులో జరగబోతోందని ఆ నివేదికలో హెచ్చరికలున్నాయి.
చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువావే విడుదల చేసిన “ఇంటెలిజెంట్ వరల్డ్ 2035: టర్నింగ్ విజన్ ఇంటు యాక్షన్” నివేదికలో ఈ అంచనాలను వెల్లడించింది. ఏఐ ఆధారిత ఏజెంట్లు భవిష్యత్తులో డిజిటల్ ప్రపంచంలో కీలక పాత్ర పోషించవచ్చని సంస్థ పేర్కొంది.
హువావే అంచనా ప్రకారం.. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 900 బిలియన్ల ఏఐ ఏజెంట్లు అందుబాటులో ఉండవచ్చు. ఈ సంఖ్య అప్పటి ప్రపంచ మానవ జనాభా కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని నివేదిక సూచిస్తోంది. అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. 2035 నాటికి గ్లోబల్ ఏఐ టోకెన్ ట్రాఫిక్లో 90 శాతానికి పైగా అటానమస్ (స్వయంప్రతిపత్తి కలిగిన) ఏఐ ఏజెంట్ల వాటా ఉండవచ్చు. ఏఐ ఏజెంట్లు కేవలం మన ఆదేశాలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, స్వయంగా కొన్ని పనులు పూర్తి చేయగలవు. అవి సమాచారాన్ని అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, మెమరీని ఉపయోగించడం, ఇతర డిజిటల్ టూల్స్ను వినియోగించడం చేయగలవు.
భవిష్యత్తులో అనేక డిజిటల్ కార్యకలాపాలను ఏఐ ఏజెంట్లు స్వయంగా నిర్వహించే అవకాశం ఉంది. మనుషుల నిరంతర పర్యవేక్షణ లేకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుని పనులను పూర్తి చేయగల సామర్థ్యం వాటికి ఉండవచ్చు. అలాగే, తమ చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించి వాటికి అనుగుణంగా స్పందించగలవు. ఏఐ మెమరీ మరింత అభివృద్ధి చెందితే, గత సమాచారాన్ని ఉపయోగించి మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైనప్పుడు వివిధ డిజిటల్ టూల్స్ను ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో కూడా అవి నేర్చుకోవచ్చు.
ఏఐ మోడల్స్ సమాచారాన్ని అర్థం చేసుకోవడానికి, కొత్త సమాచారాన్ని రూపొందించడానికి టోకెన్లు ప్రాసెస్ చేస్తాయి. ఏఐ ఏజెంట్ల సంఖ్య పెరిగే కొద్దీ టోకెన్ల వినియోగం కూడా వేగంగా పెరిగే అవకాశం ఉందని హువావే చెబుతోంది. ఈ ఏజెంట్లు నిరంతరం సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూ, వివిధ పనులను ఒకేసారి నిర్వహించగలవు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటింగ్ సామర్థ్యంపై భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
900 బిలియన్ల ఏఐ ఏజెంట్లను మెయింటైన్ చేయడానికి భారీ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు అవసరం కావచ్చు. డేటా సెంటర్లు, ప్రాసెసింగ్ సామర్థ్యం, శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలను మరింత అభివృద్ధి చేయాల్సి రావచ్చు. ఏఐ ఏజెంట్లు మరింత స్వతంత్రంగా మారడంతో భద్రత కూడా కీలక అంశంగా మారుతుంది. స్వతంత్రంగా పనిచేసే సాఫ్ట్వేర్ను నియంత్రించడానికి, సురక్షితంగా నిర్వహించడానికి కొత్త వ్యవస్థలు అవసరం కావచ్చు.
Also Read: ఏఐని ప్రేమిస్తున్న యువత? చాట్బాట్స్ని గుడ్డిగా నమ్మితే అంతే సంగతులు
ఏఐ అభివృద్ధి విషయంలో అమెరికా, చైనా వేర్వేరు విధానాలను అనుసరిస్తున్నాయి. అమెరికా టెక్నాలజీ రంగంలో కొందరు నిపుణులు అడ్వాన్స్ ఏఐ సామర్థ్యాల అభివృద్ధిపై లిమిట్స్ గురించి చర్చిస్తున్నారు. చైనా మాత్రం తన ఆర్థిక వ్యవస్థలో ఏఐ వినియోగాన్ని వేగంగా పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఏఐ వల్ల ఏర్పడే కొత్త ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని టెక్నాలజీ ప్రమాణాలను కూడా అభివృద్ధి చేస్తోంది. 2035 నాటికి ఏఐ ఏజెంట్లు డిజిటల్ ప్రపంచంలో మరింత పెద్ద పాత్ర పోషించే అవకాశం ఉంది. వాటి పెరుగుదల కంప్యూటింగ్, ఆన్లైన్ సేవలు, వ్యాపార కార్యకలాపాలు, సాఫ్ట్వేర్ వినియోగాన్ని గణనీయంగా మార్చే అవకాశం ఉంది.
Also Read: యూట్యూబ్ వ్యూస్ కోసం రూ.1.13 కోట్లు ఖర్చు చేసిన 9 ఏళ్ల బాలుడు.. తండ్రికి తెలియకుండానే.. చివరికి
ఏఐ వినియోగం, అభివృద్ధి ఊహకందని వేగంగా పెరుగుతుంది. దీంతో మనుషులు ఏఐ పట్ల నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని చాలామంది నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. ఏఐ స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తే అది వినాశనానికి దారి తీయవచ్చని వారి వాదన. అలాగే ఏఐ వినియోగం కోసం భారీ కంప్యూటింగ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం పర్యావరణానికి హాని జరుగుతోందనేది కాదనలేని నిజం.