Fuel Hike: ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం భారత్ సహా ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. ఇప్పటికే దేశంలో కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగ్గా.. తాజాగా దేశ రాజధాని దిల్లీలో ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజే ధరలు పెరగడంతో వాహనదారులు అవాక్కవుతున్నారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తన హై-ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్ XP100 ధరను లీటరుకు రూ.11 మేర పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. దీంతో దిల్లీలో దీని ధర రూ.149 నుంచి రూ.160కి చేరుకుంది. అయితే ఈ ప్రీమియం క్వాలిటీ పెట్రోల్ ను ప్రధానంగా లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ బైక్ల కోసం ఉపయోగిస్తారు. మరోవైపు ప్రీమియం డీజిల్ వేరియంట్ అయిన ‘ఎక్స్ ట్రా గ్రీన్’ ధరను సైతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లీటర్ కు రూ.1.50 మేర పెంచింది. ఫలితంగా అది రూ.91.49 నుంచి రూ.92.99కి చేరింది.
మధ్యప్రాశ్చ్యంలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో బుధవారం.. విమాన ఇంధన ధరలు సైతం దేశీయంగా 8.5% మేర పెరిగాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్) ధర కిలో లీటరుకు రూ. 1,04,927 కు చేరింది. మంగళవారు ఇది రూ. 96,638గా ఉండటం గమనార్హం. వాస్తవానికి ఇవాళ ఏటీఎఫ్ ధర 115 శాతం పెరిగి రూ.2,07,341 చేరింది. కానీ దేశీయ విమానయాన సంస్థలకు రేటును కిలీమీటర్ కు రూ. 1,04,927గా కేంద్రం సవరించడం విశేషం. మరోవైపు దేశంలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.195.50 మేర పెరిగి.. రూ.2,078.50 చేరింది.
ప్రస్తుతానికి ఇవాళ చోటుచేసుకున్న ధరల పెరుగుదల.. సామాన్యులపై ఎలాంటి భారం మోపలేదు. ఎందుకంటే ప్రీమియం పెట్రోల్, డీజిల్ ను ఖరీదైన బైక్స్, కార్లు వాడే వారిపైనే ప్రభావం చూపనుంది. అలాగే జెట్ ఫ్యూయెల్ ధర పెరిగినప్పటికీ.. అది సామాన్యులను పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. కమర్షియల్ సిలిండర్ పెరుగుల సైతం.. హోటల్స్, రెస్టారెంట్లపై భారాన్ని మోపుతుంది. అయితే ప్రత్యక్షంగా సామాన్యులపై వీటి ప్రభావం కనిపించనప్పటికీ.. పరోక్షంగా మాత్రం కచ్చితంగా ఇది సామాన్యులపై భారం మోపుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Best Air Coolers: ఏసీ లాంటి చల్లదనం.. బడ్జెట్ ధరలో ‘థర్మల్ ప్రొటెక్షన్’ ఉన్న బెస్ట్ ఎయిర్ కూలర్లు!