Saam Rammohan Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాల వల్ల దేశంలో ఇంధన, గ్యాస్ సరఫరా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధాన్ని సాకుగా చూపి, దేశీయంగా ఇంధన సరఫరాను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని ఆయన విమర్శించారు. సరఫరాలో లోపం లేకపోతే, సామాన్యులు , ఆటో డ్రైవర్లు గ్యాస్ బంకుల చుట్టూ గంటల తరబడి ఎందుకు వేచి ఉండాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఆటోవాలాలు గ్యాస్ దొరకక ఉపాధి కోల్పోయి తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ధరల పెంపు – సామాన్యుడిపై భారం
కమర్షియల్ సిలిండర్ ధరలను మళ్ళీ పెంచడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిత్యావసర ధరలు పెరగడానికి ఇలాంటి నిర్ణయాలే కారణమని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల గురించి మాట్లాడే బీజేపీ, ఆ తర్వాత సామాన్యుడి నడ్డి విరుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆదుకుంటుంటే.. కేంద్రం మాత్రం ధరల పెంపుతో ఇబ్బందులకు గురిచేస్తోందని పోల్చి చెప్పారు.
బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే
రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ఒక్కటేనని సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. వారిద్దరి మధ్య అంతర్గత ఒప్పందం ఉందని, అందుకే ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా బీఆర్ఎస్ నేతలు కేంద్రాన్ని పల్లెత్తు మాట కూడా అనడం లేదని ధ్వజమెత్తారు. ‘మిత్ర పక్షం’ లాగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు.
రాష్ట్ర బీజేపీ నేతలు వాస్తవాలను గ్రహించి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. గ్యాస్ కొరతను తక్షణమే తీర్చి, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ కేంద్రం తన మొండి వైఖరిని వీడాలని సామ రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.