Housing Market: ఓ వైపు అంతర్జాతీయ పరిణామాలు.. మరోవైపు కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు.. సన్నగిల్లుతున్న సగటు సామాన్యుడి ఆశలు. ఈ నేపథ్యంలో దేశంలో హౌసింగ్ మార్కెట్ ఏ విధంగా ఉంది.. ఉండబోతోంది? సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి ఉంటుందా? సామాన్యుడికి ధరలు అందుబాటులో వస్తాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
పెరుగుతున్న మహా నగరాలు
దేశంలో నగరాలు మహానగరాలుగా మారిపోతున్నాయి. ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల పరిధి క్రమంగా పెరుగుతోంది. ఇక హైదరాబాద్ విషయాని కొద్దాం. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సిటీ పరిధి ఉండేది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చేరింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పాలకులు కొత్త నగరాలకు శ్రీకారం చుడుతున్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్లో కొత్త నగరాలకు అంకురార్పణ జరుగుతున్నాయి.
ఈ క్రమంలో దేశంలోని 9 ప్రధాన నగరాలపై స్థిరాస్తి డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ ఓ నివేదిక వెల్లడించింది. దేశంలో యావరేజుగా కొత్తగా ప్రారంభమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుల ధరలు 9 శాతం పెరిగినట్టు తేల్చింది. 2024-25 ఆర్థిక ఏడాదికి గృహాల సగటు చదరపు అడుగు ధరలను సైతం బయటపెట్టింది.
అమాంతంగా ఇళ్ల ధరలకు రెక్కలు
అన్నింటికి కంటే టాప్లో కోల్కతా 29 శాతం ధరలు పెరిగాయి. ఆ తర్వాత థానె -17, బెంగుళూరు-15, పూణె-10, ఢిల్లీ, హైదరాబాద్ సిటీల్లో ఐదేసి శాతం పెరిగినట్టు తేల్చింది. అత్యంత చౌవకైన సిటీగా చెన్నై పేరు దక్కించుకుంది. ముంబై, నవీ ముంబై ప్రాంతాలు మూడు శాతం చొప్పున ధరలు చొప్పున తగ్గుముఖం పట్టాయి.
ALSO READ: ఏకంగా రూ. 3 వేలకు పెరిగిన పసిడి, లక్ష దాటే ఛాన్స్
టాప్-5లో హైదరాబాద్
చదరపు అడుగు ధరలు తొమ్మిది నగరాల్లో ఇలా ఉన్నాయి. తొలుత కోల్కతాలో ఒకప్పుడు చదరపు అడుగు ధర రూ.6201 నుంచి రూ. 8009 లకు చేరింది. ఢిల్లీలో చదరపు అడుగు ధర రూ.13,396 నుంచి రూ.14,020కు పెరిగింది. పుణెలో అయితే చదరపు అడుగు ధర రూ.9,877 నుంచి రూ.10,832 వద్దకు చేరుకుంది. థానేలో చదరపు అడుగు ధర రూ.11.030 నుంచి రూ.12,880 వద్ద కొనసాగుతోంది.
ఇక భాగ్యనగరం హైదరాబాద్లో చదరపు అడుగు ధర రూ. 7890 నుంచి రూ.8306 లకు ఎగబాకింది. చెన్నైలో కూడా అడుగు ధర రూ. 7645 నుంచి రూ. 7989 వద్దకు చేరింది. బెంగళూరులో చదరపు అడుగు ధర రూ. 8577 నుంచి రూ.9852కు చేరుకుంది. కేవలం రెండు నగరాల్లో మాత్రమే తగ్గుముఖం పట్టాయి. ముంబైలో అడుగు ధర రూ. 35,215 నుంచి రూ.34,026కి దిగజారింది. నవీ ముంబైలో కూడా రూ.13,286 నుంచి రూ.12,855 కు తగ్గింది.
ప్రాప్ ఈక్విటీ డేటా ప్రకారం.. 2025 ఏడాది జనవరి నుంచి మార్చి వరకు గృహాల అమ్మకాలు 23 శాతం తగ్గుముఖం పట్టాయి. బెంగళూరు, ఢిల్లీ-ఎన్సిఆర్ మినహా దాదాపు 7 నగరాల్లో అమ్మకాలు నెమ్మదించాయి. బెంగళూరు, కోల్కతా, పూణే, థానే నగరాల్లో ఇళ్ల ధరలు 10-30 శాతం మధ్య పెరిగాయి.
ఈ విషయాన్ని ప్రాప్ఈక్విటీ సీఈవో తెలిపారు. గతేడాదిలో డిమాండ్, సరఫరా తగ్గినప్పటికీ, నిర్మాణ సామగ్రితో సహా ఇన్పుట్ ఖర్చు పెరుగుదల ఇళ్ల ధరలు పెరిగినట్టు తెలిపారు. ఓవరాల్గా దేశంలో రియాల్టీ రంగం క్రమంగా ఊపందుకుంటుందనే చెప్పవచ్చు.