India Oil Imports: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై పడింది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో.. వందల సంఖ్యలో చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. రష్యా నుంచి చమురు కొనుగోలుకు తాత్కాలిక ఉపశమనం లభించిందని, అందుకు అమెరికా అవకాశం కల్పించిందని కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి అవసరమని ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీని టార్గెట్ చేశాయి.
భారత్, అమెరికా ట్రేడ్ డీల్ కు ముందు.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని కారణం చూపిస్తూ 25 శాతం వరకు సుంకాలు విధించారు ట్రంప్. ట్రేడ్ డీల్ తర్వాత ఈ సుంకాలు 18 శాతానికి తగ్గించారు. అమెరికా సుప్రీంకోర్టు సుంకాలు విధించే అధికారం ట్రంప్ కు లేదని తేల్చడంతో.. సుంకాలు మరింత తగ్గాయి. అంతకు ముందు రష్యా నుంచి చమురు కొనుగోలును సాకుగా చూపిస్తూ అమెరికా భారత్ పై సుంకాలు విధించింది. తాజాగా ఇరాన్ తో యుద్ధం కారణంగా.. హార్ముజ్ జల సంధి మార్గంలో భారత్ కు రావాల్సిన చమురు నౌకలు నిలిచిపోయాయి. దీంతో భారత్ చమురు కొనుగోళ్లకు మళ్లీ రష్యా వైపు చూస్తుందని, కానీ అందుకు అమెరికా అనుమతి అవసరమని కథనాలు ప్రచారం అవుతున్నాయి.
Also Read: భగ్గుమంటున్న అంతర్జాతీయ చమురు ధరలు.. పెట్రో ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన
కానీ ఈ ఏడాది ఫిబ్రవరి లెక్కల ప్రకారం.. భారత్ కు రష్యా అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా ఉంది. భారతీయ రిఫైనరీలు రోజుకు దాదాపు 1.0 నుంచి 1.7 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకున్నాయి. మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 25-30% అంటే సుమారు 28-48 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. అంటే ప్రతిరోజూ దాదాపు 10 లక్షల బ్యారెళ్ల రష్యన్ చమురును కొనుగోలు చేస్తోంది. ఈ లెక్కలు చూస్తే భారత్ రష్యా చమురు కొనుగోళ్లకు అమెరికా అనుమతి అవసరం లేదని స్పష్టం అవుతుంది. రష్యా చమురును కొనుగోలుకు అమెరికా అనుమతిని కోరితే, భారత్ చమురు దిగుమతులు ఈ స్థాయిలో ఉండవని అధికార పార్టీ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతుంది.
భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% కంటే ఎక్కువ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో నిరంతర ఆయిల్ సరఫరా అంతర్జాతీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చమురు సరఫరాకు ఆటంకం కలిగితే.. మధ్యతరగతి ప్రజల ఇంటి బడ్జెట్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ తన ఇంధన కొనుగోలు బాస్కెట్ ను విస్తరించింది. రష్యా నుంచి తక్కువ ధరలకు చమురు అందుబాటులో ఉండడంతో.. ముందస్తుగానే భారీగా ముడి చమురును కొనుగోలు చేసింది.
భారత్ కు.. రష్యా, గల్ఫ్ దేశాలు మాదిరిగానే అమెరికాతోనూ చమురు సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య దౌత్య సంబంధాల్లో సహజంగానే వాణిజ్య చర్చలు, సుంకాలు, రాజకీయ చర్చలు ఉంటాయి. అటువంటి చర్చలను “అనుమతి”గా అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదని విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ భారత్ ముందు నుంచీ తన వైఖరి గురించి చాలా స్పష్టంగా చెబుతోంది. తన ఇంధన కొనుగోళ్లు.. మార్కెట్ పరిస్థితులు, జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయని న్యూఢిల్లీ పదే పదే సష్టం చేస్తుంది. వాస్తవానికి, వాషింగ్టన్ రష్యా చమురు కొనుగోళ్లపై సుంకాలు విధించినప్పటికీ భారత్ దిగుమతులను ఆపలేదు.