Petrol-Diesel Prices:పశ్చిమ ఆసియాలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతోంది. చమురు రావాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) ను మూసివేస్తున్నట్లు ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (IRGC) సోమవారం ప్రకటించింది. ఈ మార్గం ద్వారా ప్రయాణించే ఏ నౌకనైనా తగులబెడతామని ఇరాన్ హెచ్చరించడంతో అంతర్జాతీయ షిప్పింగ్ రంగం కుదేలౌతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్పై వైమానిక దాడులను ఉధృతం చేయడంతో, ఇరాన్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఇరాన్ గల్ఫ్ దేశాల ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేపడుతోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు వరుసగా మూడవ రోజూ కూడా భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $79.44 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఒకానొక సమయంలో ఇది $82.37కి చేరి 2025 జనవరి తర్వాత అత్యధిక స్థాయిని నమోదు చేసింది. మరోవైపు షిప్పింగ్ ఖర్చులు కూడా భారీగా పెరగడంతో పాటు, బీమా సంస్థలు ఈ మార్గంలో ప్రయాణించే నౌకలకు కవరేజీని రద్దు చేశాయి. దీంతో చమురు సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తినప్పటికీ.. భారత్ సురక్షితంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం వద్ద మొత్తం 50 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. ఇందులో 25 రోజుల ముడి చమురు (Crude oil) మరియు మరో 25 రోజుల శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత కొన్నేళ్లుగా భారత్ తన చమురు దిగుమతులను వైవిధ్యపరిచింది. చాలా వరకు సరఫరాలు హోర్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వస్తున్నాయి.
ఇంధన సరఫరాను పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్నప్పటికీ.. ముందస్తు ప్రణాళికల వల్ల స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. వినియోగదారుల ప్రయోజనాలే తమకు పరమావధి అని, పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
Read Also: War Insurance Rules: ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు.. భవనం దెబ్బతింటే.. బీమా కంపెనీలు చెల్లిస్తాయా?