నాగర్ కర్నూల్లో తండ్రీకొడుకుల రాజకీయాల మధ్య యువత పట్టింపు లేకుండా పోతోందా? ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ యూత్ క్యాడర్ నిర్లక్ష్యానికి గురవుతోందా? అందుకే కొంతకాలంగా వారంతా పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. అవుననే ఆన్షర్ వస్తోంది. పార్టీని అధికారంలోకి తేవడానికి నాడు ఉరకలెత్తిన యువ ఉత్సాహం.. ఇప్పుడు చల్లబడిందంటున్నారు.
తను ఎమ్మెల్యేగా కావాలనుకున్న దశాబ్దాల కలను తన కొడుకు రాజేశ్రెడ్డి ద్వారా నెరవేర్చుకున్నారు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదరరెడ్డి. ఉన్నత విద్యావంతుడు, డాక్టరైన రాజేశ్రెడ్డికి రాజకీయాల్లో అనుభవం లేదు. అందుకే ఆది నుంచి ఆయన తండ్రి చాటు బిడ్డగానే అక్కడి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు తనదైన మార్కును వేసుకోలేకపోయారనే ప్రచారం కూడా ఉండటంతో యువత ఆయనతో సంతృప్తిగా కొనసాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డివి ఫెయిల్ పాలిటిక్స్. కానీ వయసు రీత్యా పెద్దవాడు కావడంతో కాంగ్రెస్ యూత్ లీడర్లు, క్యాడర్ ఆయన వద్దకు కూడా వెళ్లరు. వీరంతా ఎమ్మెల్యేగా ఉన్న కొడుకు రాజేశ్రెడ్డికే జై కొడతారు. కానీ ఎమ్మెల్యే మాత్రం తండ్రిని కాదని అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేదనే రాజకీయ వాతావరణం అక్కడ కొనసాగుతోంది. దీంతో యువతలో తీవ్ర నైరాశ్యానికి ఇది ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఆయనే ఎమ్మెల్సీ, ఆయనే ఎమ్మెల్యే ..ఈ రెండు పాత్రలను దామోదర్రెడ్డి విజయవంతంగా పోషిస్తున్నారనే ప్రచారం నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఉంది. సోషల్ మీడియాలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేది యువతే. కానీ తమను వీరిద్దరూ పట్టించుకోవడం లేదనే అసహనం, అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోవడంతో అభివృద్ది, పార్టీ కార్యక్రమాల ప్రచారంపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయింది. ఇది ప్రతిపక్షాలకు మంచి అస్త్రంగా మారుతోంది. దీంతో డ్యుయల్ రోల్ వ్యవహారం ఇక్కడ బెడిసి కొడుతుందనే వాదన బలపడుతోందని చెబుతున్నారు. ఇకనైనా పార్టీ క్యాడర్ను పట్టించుకోవాలని, యువతను పట్టించుకోవాలని కోరుతున్నారు కాంగ్రెస్ అభిమానులు.