భారతదేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ కేంద్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 కేంద్ర బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. గతంలో ప్రారంభించిన సెమీకండక్టర్ మిషన్ (ISM 1.0) సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని, మరింత విస్తృతమైన లక్ష్యాలతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0ను మంత్రి పార్లమెంటులో ప్రతిపాదించారు.
చిప్ తయారీలో స్వయం సమృద్ధి..
కేవలం సెమీకండక్టర్ల తయారీకే పరిమితం కాకుండా, ఈ రంగంలో భారత్ను స్వయం సమృద్ధిగా మార్చడమే ISM 2.0 ప్రధాన ఉద్దేశ్యం. దీని ద్వారా చిప్ తయారీకి అవసరమైన పరికరాలు (Equipment), ముడి పదార్థాల (Materials) ఉత్పత్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనుంది. ముఖ్యంగా ఫుల్-స్టాక్ ఇండియన్ ఐపీ (Intellectual Property) అభివృద్ధి చేయడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఎలక్ట్రానిక్స్ రంగానికి భారీ ఊతం..
ఏప్రిల్ 2025లో ప్రారంభించిన ‘ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్’కు పరిశ్రమ వర్గాల నుండి అద్భుతమైన స్పందన లభించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. తొలుత రూ. 22,919 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ పథకానికి, లక్ష్యానికి మించి రెట్టింపు పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఈ సానుకూల ధోరణిని కొనసాగించడానికి, ఈ పథకం కేటాయింపులను రూ. 40,000 కోట్లకు పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు.
పెట్టుబడుల వెల్లువ..
ఆగస్టు 2025 నాటికి భారత్ ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో 10 భారీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా సుమారు రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడులు దేశంలోకి వచ్చాయి. ISM 2.0 ద్వారా ఈ పెట్టుబడుల ప్రవాహం మరింత పెరగనుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
పరిశోధన, నైపుణ్యాభివృద్ధి..
సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పరిశ్రమల భాగస్వామ్యంతో పరిశోధనా కేంద్రాలు (Research Hubs), శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం 315 సంస్థల్లో విద్యార్థులకు చిప్ డిజైనింగ్లో శిక్షణ ఇస్తుండగా, దీనిని మరింత విస్తరించనున్నారు.
ఏఐ మిషన్ 2.0 దిశగా అడుగులు..
సెమీకండక్టర్ రంగంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలోనూ భారత్ దూసుకుపోతోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. సుమారు 500 విశ్వవిద్యాలయాలలో ఏఐ శిక్షణను ప్రవేశపెట్టేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే ఐదు నుండి ఆరు నెలల్లో ఏఐ మిషన్ 2.0ను కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రణాళికను రూపొందిస్తూ, ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ మిషన్లు సాగనున్నాయి.
ALSO READ: Income Tax: మధ్యతరగతి వారికి పండగలాంటి వార్త.. నెలకు లక్ష వరకు ఆదాయం ఉన్నా ‘జీరో’ టాక్స్!