India vs China: భారత సరిహద్దుల్లోని అతిపెద్ద దేశం చైనా. అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశాల్లో ఇదీ ఒకటి. ఓ దశలో ఆర్థికంగా భారత్ తో సమానంగా ఉన్న చైనా.. విఫ్లవాత్మక నిర్ణయాలతో జెట్ వేగంతో అభివృద్ధి చెందింది. ప్రస్తుతం భారత్ సైతం ఆసియాలో చైనాకు గట్టి పోటీ ఇచ్చే దేశంగా ఎదుగుతోంది. అయితే సాధారణంగా తమకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’ ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. మరి పక్కనే ఉన్న చైనాకు భారతీయులు వెళ్తే.. అక్కడి రోజూవారి ఖర్చులు ఏ విధంగా ఉంటాయి? ఇంటి అద్దె, నిత్యవసరాల ధరలు భరించగలరా? లేరా? అన్నది ఈ కథనంలో పరిశీలిద్దాం.
భారత్ తో పోలిస్తే.. చైనాలో జీవన వ్యయం (Cost Of Living) అధికంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా చైనాలో జీవన వ్యయం భారతదేశం కంటే సుమారు 50-60 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే కొన్ని విలాసవంతమైన సేవలు, రవాణా సౌకర్యాల విషయంలో మాత్రం ఆశ్చర్యకరంగా భారత్ కంటే చైనా కాస్త తక్కువ ధరలనే కలిగి ఉందని పేర్కొంటున్నాయి.
కొన్ని నివేదికల ప్రకారం.. భారత్ లో సగటున ఒక వ్యక్తి నెలవారీ ఖర్చు 425 డాలర్లు (సుమారు రూ.35,000) ఉండగా.. చైనాలో అది 650 డాలర్ల (రూ.54,000) వరకూ ఉంటుంది. అయితే భారత్ తో పోలిస్తే చైనాలో ఒక వ్యక్తి సగటు ఆదాయం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. ధరలు కాస్త అధికంగా ఉన్నప్పటికీ అక్కడి ప్రజలపై పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. అదే భారత్ నుంచి ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి జీవించాలంటే అక్కడి ధరలు చూసి.. అవాక్కవ్వాల్సిందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఒక వ్యక్తి తప్పక ఖర్చు చేయాల్సిన నిత్యవసర వస్తువుల ధరలు.. భారత్ తో పోలిస్తే చైనాలోనే ప్రియంగా ఉన్నాయి. ఉదాహరణకు భారత్ లో ఒక బడ్జెట్ రెస్టారెంట్ లో భోజనం చేయాలంటే ఒక వ్యక్తికి రూ.250-300 వరకూ ఖర్చు అవుతుంది. అదే చైనాలో రూ.350-450 ఖర్చు చేయాలి. అలాగే లీటర్ పాలు మన దగ్గర రూ.60-70 ఉంటే.. చైనాలో ఏకంగా రూ.150-180 వరకూ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నారు. భారత్ లో బియ్యం కేజీ రూ.50-70 ఉంటే చైనాలో రూ.80-100 ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్లు డజన్ రూ.80-100 ఉంటే చైనాలో రూ.150-170 మధ్య ఉన్నాయి. ఉద్యోగులకు అత్యవసరమైన ఇంటర్నెట్ సేవలు భారత్ లో నెలకు రూ.600-800 మధ్య ఉంటే చైనాలో ఇది రూ.1,200-1.500గా ఉంది. అయితే పెట్రోల్ మాత్రం భారత్ లో రూ.100-110 ఉంటే.. చైనాలో మాత్రం రూ.95-105 మధ్యనే ఉండటం గమనార్హం.
టూరిస్ట్ నివేదికలు, సోషల్ మీడియా కథనాలు, పర్యాటకుల అనుభవాల ప్రకారం.. భారత్ తో పోలిస్తే చైనాలోనే కొన్ని సేవలు తక్కువకి లభిస్తున్నాయి. చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం కారణంగా టాక్సీ సేవలు చాలా చౌకగా లభిస్తాయి. ఉదాహరణకు చైనాలో బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్లలో ప్రయాణం కేవలం రూ.600 – రూ800 కే పొందొచ్చు. అలాగే మెట్రో రైళ్ల ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.3 స్టార్ లేదా 4 స్టార్ హోటల్ గదులు చైనాలోని కొన్ని నగరాల్లో భారత్తో పోలిస్తే తక్కువ ధరకే లభిస్తున్నాయి.
Also Read: టార్గెట్ టీటీడీ ఛైర్మన్.. ఉచ్చుబిగుస్తున్న వైసీపీ.. ఇరకాటంలో టీడీపీ!
అయితే ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, కొత్త ఇల్లు చైనాలో కొనుక్కోవాలన్న సామాన్యులకు చుక్కలే అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా బీజింగ్, షాంఘై వంటి నగరాల్లో ఇంటి అద్దెలు భారతదేశంలోని ముంబై, బెంగళూరు, హైదరాబాద్ కంటే 2 నుండి 3 రెట్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఆహారం, ప్రాథమిక అవసరాలకు భారత్ చాలా బెస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం చైనా కరెన్సీ యువాన్ విలువ.. భారత్ కరెన్సీలో రూ.13కి సమానం కావడంతో అక్కడ ఖర్చు చేసే ప్రతి రూపాయి భారతీయులకు భారంగానే అనిపిస్తుంది.
Also Read: మామ సీటుపై కన్నేసిన హరీశ్? ఫామ్ హౌస్కే పరిమితం చేసే ప్లాన్!