Vijayasai Reddy: మాజీ ఎంపీ వేణుంబిక విజయసాయిరెడ్డి.. అదేనండి వైసీపీకి రిజైన్ చేసి ఏ పార్టీలో చేరకుండా రాజకీయం విరామం ఇచ్చిన సాయిరెడ్డి మళ్లీ వైసీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. సొంతగా టీవీ చానల్ పెడతానని ప్రకటించిన విజయసాయి.. ఆ సంగతి మర్చిపోయారో ఏమో కాని, సోషల్ మీడియాలో మాత్రం తన రీఎంట్రీకి పాట్లు పడుతున్నట్లు కనిపస్తున్నారు. ఆ క్రమంలో పార్లమెంటులో అమరావతి చట్టబద్దత బిల్లుపై చర్చకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, జగన్కు తిరిగి అవ్వడానికే అంటున్నారు. ఒకవైపు అమరావతిపై కమ్మరావతని బురద జల్లుతూ, మరోవైపు వైసీపీ ఎంపీలపై సాయిరెడ్డి ధ్వజమెత్తడం పాత మిత్రుడ్ని ప్రసన్నం చేసుకోవడానికే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వేణుంబిక విజయసాయిరెడ్డి.. ఈ ఆడిటర్ వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా ఉన్నప్పుడు.. ఆయనపై విశాఖ పరిసరాల్లో భూకబ్జాలకు సంబంధించి లెక్కలేనన్ని ఆరోపణలు వచ్చాయి. ఆయన ఒంటెద్దు పోకడలపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు కూడా జగన్కు ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ ఎపెక్ట్తోనే అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో సాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించారని.. సజ్జల రామకృష్ణారెడ్డి హవా నడిచిందంటారు. ఇక ఎన్నికల సమయానికి ఆయన నెల్లూరు ఎంపీగా అయిష్టంగానే పోటీ చేయాల్సి వచ్చింది. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త అయిన ఆయన దారుణ పరాజయం పాలయ్యారు.
వైసీపీ కూడా ఊహించని ఓటమి చవి చూసింది. అప్పటికే జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో ఏ-2గా ఉన్న సాయిరెడ్డికి, తర్వాత వచ్చిన భూ దందాల ఆరోపణలతో మళ్లీ కేసులు ఎక్కడ నమోదవుతాయో అన్న గుబులుతో తత్వం బోధపడింది. సడన్గా వైసీపీకి, రాజసభ సభ్యత్వానికి కూడా రిజైన్ చేసి రాజకీయ సన్యాసం ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించి, శేష జీవితం ఆ వ్యాపకంతోనే గడిపేస్తానన్నట్టు ఎప్పటికప్పుడు వ్యవసాయం చేస్తున్నట్లు పోస్టుల పెడుతూ వచ్చారు. పార్టీకి రాజీనామా చేశాక జగన్ను పెద్దగా టార్గెట్ చేయకపోయినా.. జగన్ కోటరీపై మాత్రం నిప్పులు చెరుగుతూనే ఉన్నారు.
ఆ క్రమంలో ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పోస్టులో అమరావతిపై ‘కమరావతి’ అని కామెంట్ చేసి కలకలం రేపారు. పార్లమెంటు అలా బిల్లు ఆమోదించిందో లేదో.. అమరావతిని కమ్మరావతి కాకుండా చూసుకోండని పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో లేరు. అసలు రాజకీయాల్లోనే లేరు. వైసీపీకి రిజైన్ చేసినప్పుడు ఆయన అదే చెప్పారు. అన్ని వదిలేసి ‘వ్యవ’సాయిరెడ్డిగా మిగిలిపోతానన్నారు. అయితే అప్పడప్పుడూ జగన్ కోటరీతో పాటు ఇతరాత్రా అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆ ఫ్లోలో గతంలో తాను మీడియా సంస్థ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దాని సంగతేమో కాని.. ఫ్రీగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తూ తిరిగి రాజకీయాల వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు.
ప్రభుత్వం కట్టేది అమరావతే తప్ప, కమరావతి కాకుండా చూచుకోండని సాయిరెడ్డి చేసిన ట్వీట్పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో విజయసాయిరెడ్డి మరో ట్వీట్తో స్పందించారు. తన ట్వీట్లో అమరావతిని కమరావతి కానివ్వవద్దు అన్న సూచనను చూసి గంగవెర్రులెత్తిన వారంతా, కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారని.. డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు.
రాజ్యసభలో రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందే సమయంలో వైసీపీ ఎంపీలు వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యసభలో రేణుకాచౌదరి అమరావతి బిల్లుపై జరిగిన చర్చలో జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమెను అడ్డుకునేందుకు ఒక్క వైసీపీ ఎంపీ కూడా ప్రయత్నించలేదు. ఇది విజయసాయిరెడ్డికి మంచి అవకాశంగా మారింది. జగన్పై కాంగ్రెస్ ఎంపీ నోరు పారేసుకుంటే.. వైసీపీ ఎంపీలు మౌనం వహించడం పట్ల సాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ ఆ విధంగా మాట్లాడితే.. మీకు చీమకుట్టినట్లు అయినా అనిపించ లేదా అంటూ వైసీపీ ఎంపీలను ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలను కనీసం ఖండించరా? అని వైసీపీ ఎంపీలకు చురకలంటించారు.
విజయసాయిరెడ్డి ట్వీట్ వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందంటున్నారు. జగన్ రెడ్డి కోటరీని టార్గెట్ చేసి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు .. సజ్జలను జగన్ దూరం పెడుతున్న సూచనలు కనిపించడంతో ఇప్పుడు తన విధేయను చూపించడానికి మళ్లీ రాజకీయం మొదలు పెట్టారంటున్నారు. గతంలో జగన్ పై ఈగ వాలనివ్వకుండా అడ్డుకున్న వ్యక్తిగా తనకు ఉన్న గుర్తింపును తిరిగి దక్కించుకోవడానికే.. ప్రస్తుతం జగన్ పక్కన ఉన్న నాయకుల విశ్వసనీయతను ఆయన బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. జగన్ రెడ్డిని అడ్డగోలుగా తిడుతున్నా పట్టించుకోని వారంతా అసలు పార్టీకి విధేయులేనా? అనే అనుమానాన్ని ఆయన రేకెత్తించే ప్రయత్నం చేయడం అందులో భాగమే అంటున్నారు. మరి తన ట్వీట్ల ద్వారా జగన్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న విజయసాయి పర్ఫార్మెన్స్ని జగన్ గమనిస్తున్నారా? అంటే డౌటే అంటున్నారు.
Also Read: Medchal: పోలీసులకే షాక్ ఇచ్చిన నిందితులు.. క్యాబేజీ బస్తాల కింద ఇంత పెద్ద మోసమా?
Story by: Apparao, Big Tv