దేశ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచిగా నిలిచే బడ్జెట్… కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు.. అది దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక పత్రం.. అసలు బడ్జెట్ అంటే ఏమిటి..? భారత బడ్జెట్ వెనుక ఉన్న చరిత్ర ఏమిటి..? అనే విషయాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి.
బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ భాషలోని బొగెట్ (Bougette) అనే పదం నుండి ఉద్భవించింది. దీనికి అర్థం ‘చిన్న తోలు సంచి’. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఆశించే ఆదాయం, చేసే ఖర్చులకు సంబంధించిన అంచనాల నివేదికనే బడ్జెట్ అని పిలుస్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1773లో ఫ్రాన్స్ దేశం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. భారత రాజ్యాంగం ప్రకారం.. బడ్జెట్ అనే పదం నేరుగా ఎక్కడా కనిపించదు. రాజ్యాంగంలోని 112వ అధికరణం బడ్జెట్ను వార్షిక ఆర్థిక నివేదిక (Annual Financial Statement – AFS) గా పేర్కొంటుంది.
భారత బడ్జెట్ చరిత్రలో ఇద్దరు వ్యక్తులు అత్యంత కీలకంగా కనిపిస్తారు. 1860లో భారత్లో మొట్టమొదటి బడ్జెట్ను జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. అయితే.. భారత ఆర్థిక ప్రణాళికా పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ పి.సి. మహలనోబిస్ (P.C. Mahalanobis) ను భారత బడ్జెట్, గణాంక వ్యవస్థల రూపకల్పనలో కీలక వ్యక్తిగా పరిగణిస్తారు. ఆధునిక భారతదేశ బడ్జెట్ ను మహలనోబిస్ ప్రవేశపెట్టాడు.. కనుకు అతడినే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇండియన్ బడ్జెట్ గా పిలుస్తారు.
బ్రిటిష్ కాలంలో ఆక్ వర్త్ కమిటీ (1920-21) సూచన మేరకు, 1924 నుండి రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేశారు. దాదాపు 92 ఏళ్ల పాటు ఈ ఆచారం కొనసాగింది. అయితే, బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల ప్రకారం 2017లో మోదీ ప్రభుత్వం రైల్వే బడ్జెట్ను తిరిగి సాధారణ బడ్జెట్లో విలీనం చేసింది.
అదేవిధంగా, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం, తేదీల్లో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఫిబ్రవరి చివరి పనిదినాన సాయంత్రం 5:30 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. 1999లో అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఆ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. ఆ తర్వాత 2017లో అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చి కొత్త ఒరవడిని సృష్టించారు.
బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందు ఆర్థిక శాఖలో హల్వా వేడుక నిర్వహించడం ఒక ఆచారంగా వస్తోంది. బడ్జెట్ గోప్యతను కాపాడటం కోసం ముద్రణలో పాల్గొనే సిబ్బంది బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడే గడుపుతారు. అయితే, సాంకేతికత పెరగడంతో 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొట్టమొదటిసారిగా ‘పేపర్లెస్ బడ్జెట్’ (డిజిటల్ కాపీ) ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ తయారీలో ఆర్థిక వ్యవహారాల శాఖ (Department of Economic Affairs) కీలక పాత్ర పోషిస్తుంది. సామాన్యుడి నుండి పారిశ్రామికవేత్త వరకు అందరి ఆశలు ఈ నివేదికపైనే ఉంటాయి. కాలక్రమేణా మారుతున్న అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనలో మరిన్ని సంస్కరణలు వస్తూనే ఉన్నాయి.