Iran Conflict: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం అన్ని దేశాలను కుదిపిస్తోంది. దాని ప్రభావం అన్నిరంగాలపై తీవ్రంగా చూపుతోంది. సామాన్యుడి నుంచి వ్యాపారవేత్తలపై పడుతోంది. చివరకు దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం కుప్పకూలాయి. మార్చి నెలలో ఏకంగా రూ. 33 లక్షల కోట్ల సంపద ఆవిరైందంటే మామూలు విషయం కాదు.
ఇన్వెస్టర్లను ముంచేసిన ఇరాన్ యుద్ధం
కొన్నాళ్లుగా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భయాలున్నా పెద్దగా పతనం కాలేదు. ఒకరోజు మార్కెట్ పతనమైనా, మరుసటి రోజు కోలుకునేది. దీనికితోడు దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గు చూపేవారు. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నుంచి చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. ఫలితంగా మార్కెట్లో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ వారంలో కూడా సూచీలు భారీగా పడిపోయాయి. ఒక్క మార్చి నెలలో సెన్సెక్స్ 6700 పాయింట్లకుపైగానే పతనం అయ్యింది. మదుపరుల సంపద లక్షల కోట్ల ఆవిరైంది.
ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడితో మార్కెట్ పతనమైంది. యుద్ధం ప్రభావం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను తీవ్రంగా దెబ్బతీసింది. దీనికితోడు అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు తోడు అయ్యాయి. ఈ నిమిషంలో ఏమి జరుగుతుందోనన్న భయం అనుక్షణం వెంటాడేది. చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హార్ముజ్ జలసంధి వద్ద చమురు నౌకలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ఫలితంగా చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో ముడి చమురు ఆశాకాన్ని తాకాయి. మార్కెట్ నుంచి ఇన్వెస్టర్లు బయటికి వెళ్లిపోయారు.
మార్చిలో ఏకంగా రూ. 33 లక్షల కోట్ల సంపద ఆవిరి
మార్చి 9 నుంచి 13 మధ్య మార్కెట్ పతనాన్ని పరిశీలిస్తే బాంబే స్టాక్ మార్కెట్ ఏకంగా 4,355 పాయింట్లు పతనమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 1299 పాయింట్లు కోల్పోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ పడిపోయింది. రికార్డు స్థాయిలో అంటే రూ. 19.86 లక్షల కోట్లు తగ్గిపోయింది.
శుక్రవారం ఒకే ట్రేడింగ్ సెషన్లో రూ.10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడిదారుల సంపద తుడిచి పెట్టుకుపోయింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైంది. మధ్య వీకెండ్, హాలీ వంటి సెలవులు కాకుండా కేవలం 9 సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 6723 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 2027 పాయింట్లు పతనమైంది.
ALSO READ: వారెవ్వా.. భారీగా పతనమైన పసిడి ధరలు.. లేటెస్ట్ అప్డేట్!
9 రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 33.68 లక్షల కోట్లు అమాంతంగా తగ్గిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధం ప్రభావం ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. రేపు ఏం జరుగుతుందోనన్న భయం వారిని అనుక్షణం వెంటాడుతోంది కూడా. సెన్సెక్స్ 75,000 మార్కు దిగువకు చేరింది. ఏప్రిల్ 2025 తర్వాత మొదటిసారి నిఫ్టీ 23,200 దిగువకు పడిపోయింది.
శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో రూపాయి మరింత బలహీన పడింది. US డాలర్తో పోలిస్తే 12 పైసలు తగ్గింది. 92.37 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూపాయి 92.37 వద్ద పడిపోయింది. గడిచిన తొమ్మిది సెషన్లలో ఒక్కరోజు మాత్రమే బుల్ జోరు కొనసాగింది.