MSME EMI Relief: ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో అనిశ్చితి నెలకొంది. యుద్ధ పరిస్థితులతో చిన్న మధ్యతరహా పరిశ్రమలపై ప్రభావం పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలకు రిలీఫ్ పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం తలెత్తింది. దీంతో రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో పాటు సప్లై చైన్ వల్ల ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిశ్రమలకు కేంద్రం ఊరటనివ్వనుంది. ఇందుకోసం 3 నుండి 6 నెలల పాటు ఈఎంఐ వాయిదాల చెల్లింపుపై మారటోరియం విధించే యోచనలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని తెలుస్తోంది.
ఇరాన్ యుద్ధం వల్ల ఎక్స్ పోర్ట్స్ భారీగా దెబ్బతిన్నాయి. ఎగుమతులు నిలిచిపోవడంతో.. చిన్న పరిశ్రమలపై ఆర్థిక భారం పడింది. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు మారటోరియం కావాలని పరిశ్రమలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటే.. కొన్ని నెలల పాటు రుణాలు తీసుకున్న వారు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో డబ్బు లభ్యత పెరుగుతుంది. ఇంధన ధరల పెరుగుదలతో ఉత్పత్తి వ్యయం పెరిగి, లాభాలు తగ్గిన పరిశ్రమలకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించవచ్చు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంట్ లో మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. మిడిల్ ఈస్ట్ లో యుద్ధంతో.. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటి వరకు రూపాయి విలువ దాదాపు 4.1 శాతం క్షీణించింది. మార్చి 30 నాటికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.95 కు దిగజారింది. ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి స్ట్రాంగ్ గా ఉందన్నారు. విదేశీ మారక నిల్వలు బలంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.
Also Read: ఎంఎస్ఎంఈలకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. పూచీకత్తు లేకుండా రూ.25 లక్షల రుణాలు
అంతర్జాతీయ పరిస్థితులు, పరిశ్రమల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే మారటోరియంపై ఒక స్పష్టమైన ప్రకటన అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉండడంతో చిన్న, మధ్య తరహా సంస్థలను కాపాడుకోవడం కోసం కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. మార్కెట్ ఒడిదుడుకులను కేంద్ర బ్యాంకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. పశ్చిమాసియాలో పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీస్తున్నారు.