Narayana Murthy On AI: ఎక్కడ చూసినా .. విన్నా ఒక్కటే యువతకు ఒక్కటే భయం. ఏఐ వచ్చేస్తోంది.. ఉద్యోగాలు పోతాయి. బీటెక్ విద్యార్థులు మొదలు ఉద్యోగులు చేస్తున్నవారు సైతం ఇదే మాట. ఇక వారి తల్లిదండ్రుల నుంచి ఇలాంటి వాయిస్ రైజ్ అవుతోంది. చివరకు మార్కెట్లో ఏఐ భయాలకు టెక్ కంపెనీల షేర్లు సైతం నేల బారు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి. ఇంతకీ బీటెక్ గ్రాడ్యుయేట్లకు ఆయన ఇచ్చిన భరోసా ఏంటి?
ఏఐ ఫియర్.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాలకు ఏఐ కోత పెడుతోందన్న భయాల నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి యువత చక్కని సలహా ఇచ్చారు. ఇటీవలి బిజినెస్కి చెందిన ఓ వెబ్సైట్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని చూసి యువతీ యువకులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మనిషికి ప్రత్యామ్నాయం కాదని తేల్చేశారాయన.
ఏఐ అనేది ఒక సాధనం మాత్రమేనని, మనిషి ఆలోచనా శక్తిని, సృజనాత్మకత ను ఎప్పటికీ భర్తీ చేయలేదన్నారు. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు ఇలాంటి భయాలు వ్యక్తమయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వీటి ద్వారా కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తాయని చెప్పకనే చెప్పారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను చూసి భయపడటం కన్నా, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. యువత నైపుణ్యాలు పెంచుకోవాలని సూచన చేశారు. ఏఐ టూల్స్ను సమర్థవంతంగా వినియోగించడం నేర్చుకుంటే ఐటీలో కెరీర్కు ఢోకా ఉండదని తేల్చేశారాయన.
భయాలు వద్దు.. అందిపుచ్చుకోండి, కెరీర్కు డోకా ఉండదు
ఏఐ అందరికీ సమాన అవకాశాలు కల్పించదన్నారు మూర్తి. జనరేటివ్ ఏఐని ఉత్పాదకత కోసం తాను స్వయంగా ఉపయోగించిన అనుభవంతో చెబుతున్నట్లు వివరించారు. తెలివిగా వినియోగించినవారికి మెరుగైన నాణ్యత, ఎక్కువ ఉత్పాదకత లభిస్తుందన్నారు. ఏఐని ప్రమాదకరంగా కాకుండా వినియోగించాల్సిన సాధనంగా చూడాలన్నారు. శిక్షణ, కృషి, నిరంతర అభ్యాసం చేస్తే భవిష్యత్తులో విజయం సాధ్యమని చెప్పకనే చెప్పారు. ఏఐ వల్ల ఉద్యోగాలు మార్పు చెందుతాయని, పూర్తిగా అంతరించి పోవన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని దానిపై పట్టు సాధించినవారికి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుందన్నారు.
అమెరికాకు చెందిన ఆంథ్రోపిక్ సంస్థ అధునాతన ఏఐ సాధనాలను విడుదల చేసింది. దీంతో ఏఐ ఆధారిత ఉద్యోగాలపై చర్చ ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ జోరందుకుంది. లీగల్ సర్వీసులు, ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో విశ్లేషణ, డేటా ప్రాసెసింగ్, వర్క్ ఫ్లో మేనేజ్మెంట్ వంటి పనులు సులభతరం చేయనుంది. సిబ్బంది అవసరమయ్యే క్లిష్టమైన ప్రక్రియలను సమర్థంగా నిర్వహించగలవని చెబుతున్నారు.
ALSO READ: కొండెక్కిన పసిడి ధర.. నేటి మార్కెట్లో తులం బంగారం ఎంతంటే?
ఐటీలో వేగంగా వస్తున్న ఈ పరిణామాలు పెట్టుబడిదారులను కలవరపాటుకు గురి చేసింది. ఈ ఆందోళనల మధ్య సాఫ్ట్వేర్, ఐటీ సేవల స్టాక్లు ఒత్తిడిలో ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో IBM షేర్లు ఒకే సెషన్లో బాగా పడిపోయింది. రెండు దశాబ్దాల్లో ఒక్క రోజులో అత్యధికంగా ఆ కంపెనీ షేర్ పడిపోయిన విషయం తెల్సిందే.