Gas cylinder blast: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో పెను ప్రమాదం సంభవించింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఒక్క సారిగా పేలి పోవడంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ పేలుడు ధాటికి ఆ ఇల్లు పూర్తిగా ధ్వంసమై శిథిలావస్థకు చేరుకుంది. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో ఉన్న సామగ్రి అంతా కాలి బూడిదవ్వడమే కాకుండా, గోడలు కూలిపోయి పెను నష్టం వాటిల్లింది.
పేలిన సిలిండర్.. ఒకరికి తీవ్ర గాయాలు
ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి బాధితుడు తీవ్రంగా గాయపడటంతో, స్థానికులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో చుట్టుపక్కల వారు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభుత్వం తమను ఆధుకోవాలంటున్న బాధితుడి కుటుంబ సభ్యులు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ లీకేజీ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందా లేదా ఇతర సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. పేలుడు తీవ్రతకు ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. కావున, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, నష్టపరిహారం అందించి అండగా నిలవాలని బాధితుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి దారుణ హత్య
ప్రజలకు తగిన జాగ్రత్తలు..
ఈ సంఘటనతో వర్ని మండలంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వంట గ్యాస్ వినియోగించే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రెగ్యులేటర్లు, పైపులను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సిలిండర్ వాసన వచ్చినప్పుడు వెంటనే కిటికీలు తెరిచి ఉంచాలని, విద్యుత్ స్విచ్లను ఆన్ చేయవద్దని అగ్నిమాపక సిబ్బంది హెచ్చరిస్తున్నారు.