Odisha Bank Incident: ఒడిశాకు చెందిన జీతూ ముండా.. మరణించిన తన సోదరి అకౌంట్ లోని రూ.20 వేల కోసం బ్యాంకు చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడు. చివరికి తన చెల్లి సమాధి తవ్వి అవశేషాలను బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. చివరకు బ్యాంకు అధికారులు, స్థానిక అధికారులు స్పందించి అతడికి డబ్బు అందించారు. ఇది ఒక్క జీతూ ముండా సమస్య మాత్రమే కాదు. దేశంలోని కోట్లాది మంది సమస్య. జనవరి 2026 ఆర్బీఐ డేటా ప్రకారం దేశంలోని పలు బ్యాంకుల్లో 72,454 కోట్ల రూపాయల అన్క్లైమ్డ్ డబ్బు మురిగిపోతోంది. అదంతా చాలా వరకు నిరుపేదలు, సామాన్యులు, జీతు ముండా లాంటి ఆదివాసీల డబ్బు.
అకౌంట్ హోల్డర్ మరణిస్తే, అతడి ఖాతాలో డబ్బు వారసులు లేదా నామినీ పొందడానికి బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి. సరైన పత్రాలు లేనప్పుడు ఏం చేయాలో ఈ కేసు ఒక ఉదాహరణగా మారింది. తన సోదరి ఖాతాలోని డబ్బు విత్డ్రా చేసుకోవడం సోదరి అస్థిపంజరాన్ని బ్యాంకుకు తీసుకువచ్చి మరణానికి రుజువుగా చూపించమని బ్యాంకు సిబ్బంది బలవంతం చేశారని సోషల్ మీడియా పలువురు కామెంట్స్ పెట్టారు. అయితే ఒడిశా గ్రామీణ బ్యాంకు అనుబంధ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఈ ఆరోపణలను ఖండించింది. అవసరమైన పత్రాలు లేకపోవడం, ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని బ్యాంక్ తెలిపింది.
బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం.. డెత్ సర్టిఫికెట్, చట్టబద్ధ వారసుల ధృవీకరణ పత్రం ఉంటేనే మరణించిన వ్యక్తి ఖాతాలోనే డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకు నిబంధనలు ప్రకారం.. జీతూ ముండా సోదరి అకౌంట్ లోని రూ. 19,402 మొత్తాన్ని ముగ్గురు చట్టబద్ధ వారసులకు పంపిణీ చేశారు.
జీతూ ముండా సోదరి ఇటీవల మరణించింది. ఆమె బ్యాంకు అకౌంట్ లో రూ.20 వేల వరకు ఉండడంతో.. జీతూ ముండా ఎలాంటి మరణ ధృవీకరణ పత్రం లేదా వారసత్వ పత్రాలు సమర్పించకుండా డబ్బు విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లాడు. అకౌంట్ లోని నామినీ కూడా మరణించడంతో.. బ్యాంకు రికార్డుల్లో జీతూ ముండా పేరు లేకపోవడం, సరైనా పత్రాలు చూపకపోవడంతో.. అతడి అభ్యర్థనను బ్యాంకు సిబ్బంది తిరస్కరించారు. తన సోదరి మరణాన్ని నిరూపించే ప్రయత్నంలో, అతడు సోదరి అస్థిపంజర అవశేషాలను మూటగట్టి బ్యాంకుకు తీసుకొచ్చాడు. ఈ ఘటన వైరల్ కావడంతో.. అధికారులు రంగంలోకి దిగి, అవసరమైన పత్రాలను జారీ చేయడంతో, అతడి క్లెయిమ్ ప్రాసెస్ అయింది.
ఖాతాదారుడు మరణించిన తర్వాత, ఆ అకౌంట్ ను సాధారణ అకౌంట్ గా పరిగణించరు. అందులోని నిధులకు సంబంధించి క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ కిందకు వస్తాయి.
Also Read: అమ్మబాబోయ్.. ఏప్రిల్లో భారీగా బ్యాంకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల హాలీడేస్ లిస్ట్ ఇదే!
ఒడిశా ఘటనతో బ్యాంకింగ్ వ్యవహారాల్లోని లోపాలను ఎత్తి చూపింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ విధానాలపై చాలా మందికి అవగాహన ఉండదు. మోసాలను నివారించడానికి, డబ్బు సరైన లబ్ధిదారులకు చేరేందుకు బ్యాంకులు కఠినమైన నియమాలను పాటిస్తాయి. కానీ సరైన పత్రాలు లేనప్పుడు, సరైన క్లెయిమ్లు కూడా ఆలస్యం కావచ్చు. అందుకే బ్యాంకు అకౌంట్లకు జాయింట్ లేదా నామినీలను పెట్టుకోవడం ఉపయోగకరమని నిపుణులు సూచిస్తున్నారు.