PM SVANidhi: చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం స్వనిధి పథకం కింద చిరు వ్యాపారులకు రూ.90 వేల వరకు రుణం అందిస్తుంది. తాజాగా క్రెడిట్ కార్డు సదుపాయాన్ని కూడా ప్రారంభించింది. పీఎం స్వనిధి(PM SVANidhi) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2030 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద కేంద్రం మూడు విడతల్లో రూ. 90,000 వరకు రుణం అందిస్తుంది.
అర్హులైన వ్యాపారులకు మొదటి విడతలో రూ. 15,000 రుణం లభిస్తుంది. మొదటి విడత రుణాన్ని సకాలంలో చెల్లిస్తే రెండో విడతలో రూ. 25,000, మూడో విడతలో గరిష్టంగా రూ. 50,000 వరకు రుణం ఇస్తారు. మొత్తంగా రూ. 90,000 వరకు రుణ సదుపాయం అందిస్తారు. ఈ పథకం కోసం ఎలాంటి పేపర్ వర్క్ అవసరంలేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డు, ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ ఉంటే సరిపోతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకు లేదా పీఎం స్వనిధి పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణాన్ని ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే వ్యాపారులను డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం రూపే క్రెడిట్ కార్డు ద్వారా ఈ రుణాలు మంజూరు చేస్తుంది. వీధి వ్యాపారులకు యూపీఐతో లింక్ అయిన రూపే క్రెడిట్ కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. 2025 డిసెంబర్ నాటికి సుమారు 69.66 లక్షల మంది ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. ఇప్పటి వరకు రూ. 15,191 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేశారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 1.15 కోట్ల మంది చిరు, వీధి వ్యాపారులకు సాయం అందించాలనేదే కేంద్రం లక్ష్యం.
ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకు నుంచి రూ. 90 వేలు ఆర్థిక సాయం పొందవచ్చు. కోవిడ్-19 తీవ్రంగా ప్రభావితమైన వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకాన్ని జూన్ 2020లో ప్రారంభించింది. ప్రధాన మంత్రి వీధి విక్రేత ఆత్మ నిర్భర్ నిధి (PM స్వనిధి) పథకంలో భాగంగా దీనిని ప్రారంభించారు. నివాస ప్రాంతాలకు దగ్గరగా వస్తువులు, సేవలను అందిస్తున్న వారికి సరైనా గుర్తింపు లేకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు లభించకపోవడంతో.. కేంద్రం ఈ పథకం ద్వారా క్రెడిట్ కార్డులను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం.. ఆగస్టు 2025లో ఈ పథకం పొడిగింపును ఆమోదించింది. రుణ వ్యవధిని మార్చి 31, 2030 వరకు పొడిగించింది.
Also Read: గుడ్ న్యూస్.. కొత్త ఏడాది నుంచి.. అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్!
స్వనిధి క్రెడిట్ కార్డు అంటే యూపీఐ-లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు. చిరు వ్యాపారుల డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు, రోజువారీ లిక్విడిటీ అవసరాలకు వడ్డీ లేని, క్రెడిట్ సదుపాయం కల్పిస్తున్నారు. యూపీఐ లింక్డ్ రూపే కార్డు ద్వారా అత్యవసర వ్యాపారం, వ్యక్తిగత అవసరాలను ఈ క్రెడిట్ను తక్షణమే యాక్సెస్ చేయవచ్చు. రెండో విడత రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన వారికి ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. డిజిటల్ చెల్లింపులపై క్యాష్బ్యాక్ ప్రోత్సాహకాలను అందిస్తుంది. నెలకు గరిష్టంగా రూ. 100.. సాధారణ అమ్మకాలపై రూ. 1,200 వరకు క్యాష్బ్యాక్ లభిస్తుంది.