Anganwadi Breakfast Scheme: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల పోషకాహారాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో అంగన్వాడీల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనుంది. 2026 జనవరి మొదటి వారంలోనే ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి దశగా ఈ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ రూపంలో హైదరాబాద్ నగరంలో ప్రారంభించనున్నారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభించనుండటం విశేషం. నగర పరిధిలోని ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేసి ఫలితాలను పరిశీలించనున్నారు.
ఈ పథకం కింద అంగన్వాడీ విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు గల ఆహారాన్ని అందించనున్నారు. టీజీ ఫుడ్స్ (TG Foods) ద్వారా రెడీ టు ఈట్ విధానంలో బ్రేక్ఫాస్ట్ సరఫరా చేయనున్నారు.
విద్యార్థులకు రోజూ ఒకే రకం ఆహారం కాకుండా మార్పులతో కూడిన బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ఒక రోజు కిచిడీ, మరో రోజు ఉప్మాను అందించాలనే విధంగా మెనూను రూపొందించారు. చిన్నారులకు సులభంగా జీర్ణమయ్యేలా, అవసరమైన పోషకాలు అందేలా ఈ ఆహారాన్ని సిద్ధం చేయనున్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న.. సుమారు 8 లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య పోషకాహారంలో ఉన్న వ్యత్యాసాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
ప్రభుత్వం ఇప్పటికే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని.. విజయవంతంగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అంగన్వాడీ స్థాయిలోనే బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకురావడం ద్వారా.. చిన్నారుల పోషణకు మరింత బలం చేకూరనుంది.
Also Read: సిద్దిపేట జిల్లాలో టెన్షన్ టెన్షన్.. పెద్దపులి కోసం కొనసాగుతున్న గాలింపు
మొత్తంగా అంగన్వాడీ విద్యార్థుల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ పథకం ఒక మైలురాయిగా నిలవనుంది.