Rs 100, 500 Notes Upgrade: రూ.100, రూ.500 నోట్లను రద్దు చేస్తు్న్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వైరల్ వార్తలపై ఆర్బీఐ స్పందించింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. రూ.100, రూ.500 నోట్లు చలామణిలో ఉంటాయని స్పష్టం చేసింది. భారత్ లో ముఖ్యంగా రూ. 100, రూ. 500 నోట్లతోనే లావాదేవీలు జరుగుతుంటాయి. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ, రిటైల్ మార్కెట్లు, గ్రామాల్లో, రవాణా వ్యవస్థలు, చిన్న వ్యాపారాలు.. నగదు కేంద్రంగానే కొనసాగుతున్నాయి. తాజాగా ఆర్బీఐ ఈ రెండు నోట్ల లావాదేవీలు మెరుగుపరుస్తామని ప్రకటించింది.
రూ.100, రూ.500 నోట్లను మరింత మెరుగుపరుస్తామని ఆర్బీఐ పేర్కొంది. అంతే కానీ నోట్ల రద్దు లేదా ఉపసంహరణ వంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. సెక్యూరిటీ, మన్నిక ప్రమాణాలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కచ్చితమైన ప్రింటింగ్, సిరా స్థితిస్థాపకత, నోట్ల మన్నికను మెరుగుపరచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఇప్పటికే ఉన్న నోట్లు చెల్లుబాటులో ఉంటాయని, మెరుగుపరిచిన వెర్షన్లు క్రమంగా చలామణిలోకి వస్తాయని చెప్పింది.
రోజువారీ నగదు లావాదేవీలలో రూ.100, రూ.500 నోట్లు ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి. కూరగాయల మార్కెట్లు, పెట్రోల్ బంక్ లు, ఆసుపత్రులు, ప్రయాణాలు ఇలా ప్రతీ చోట ఈ నోట్లు చలామణిలో ఉంటాయి. ఈ నోట్లను ఎక్కువగా వాడడం వల్ల మన్నిక తగ్గుతుంది. సెక్యూరిటీ ఫీచర్స్ దెబ్బతింటుంటాయి. దీంతో ఇలాంటి నోట్లను ఆర్బీఐ అప్డే్ట్ చేస్తుంది. అలాగే నకిలీ నోట్లను అరికట్టేందుకు తరచూ కొత్త అప్డేట్స్ ను తీసుకొస్తుంది.
ఆర్బీఐ నకిలీ నోట్ల నిరోధక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. అప్పుడప్పుడూ నకిలీ నోట్లను స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు. మైక్రో-లెటరింగ్, వాటర్మార్క్ షార్ప్నెస్, ఇంక్ స్థిరత్వాన్ని మెరుగుపరిచి ఫేక్ నోట్స్ ను ఆర్బీఐ అరికడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు నోట్లను అప్గ్రేడ్ చేస్తుంటాయి. ఇదంతా బయటకు తెలియకుండానే జరుగుతుంది.
Also Read: సర్కారు కొత్త ప్లాన్.. ఇక ఏటీఎంల నుంచి రూ.10, రూ.20, రూ.50 నోట్లు, కేవలం వాటిలోనే..
రూ. 100 నోటు క్వాలిటీని మెరుగుపర్చనున్నారు. మడతపెట్టడం, ఇతర చలామణిని తట్టుకునేందుకు ప్రింట్ కాంట్రాస్ట్, ఇంక్ మన్నిక మెరుగుపరచనున్నారు. వాటర్మార్క్, సెక్యూరిటీ థ్రెడ్ స్పష్టతను పెంచనున్నారు. నోటు జీవితకాలాన్ని పొడిగించడమే దీని లక్ష్యం అని అధికారులు చెబుతున్నారు. పాడైన నోట్లను తరచుగా మార్చడం వల్ల ప్రింటింగ్ ,లాజిస్టికల్ ఖర్చులు పెరుగుతాయి. అప్డేట్ వెర్షన్ తో నోట్ల క్వాలిటీ మెరుగుపడుతుందని ఆర్బీఐ తెలిపింది.