Hospital Pricing Gap| ఆసుపత్రి బిల్లు చేతికి వచ్చినప్పుడు మందులు, డాక్టర్ ఫీజు మాత్రమే కనిపించవు. చిన్న చిన్న మెడికల్ వస్తువుల పేరుతో కూడా బిల్లు భారీగా పెరుగుతుంది. అయితే వాటి అసలు ధర ఎంత ఉంటుందో చాలామంది రోగులకు తెలియదు. ఈ అంశంపై తాజాగా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ తుకారాం ముండే తీవ్రంగా స్పందించారు. ఆయన ఆసుపత్రి బిల్లు, అక్కడి ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత కాలం 5 స్టార్ హోటల్స్, కంపెనీ క్యాంటీన్స్పై ఆహార భద్రత రెయిడ్స్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయన తాజాగా ఆసుపత్రుల్లో ఉపయోగించే కొన్ని మెడికల్ కన్స్యూమబుల్స్ ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రజలు నిస్సహాయ స్థితిలో వాటిని చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.
మహారాష్ట్రలో నిర్వహించిన ఒక సర్వే వివరాలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ట్రేడ్ ధరకు, ఉత్పత్తిపై ముద్రించిన MRP (ఎంఆర్పి)కి భారీ తేడా కనిపించిందని చెప్పారు.
ముండే వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక ఐవి ఇన్ఫ్యూషన్ సెట్ (సెలైన్ బాటిల్ సెట్) ట్రేడ్ ధర రూ.11.05గా ఉంది. అదే ఉత్పత్తిపై గరిష్ఠ రిటైల్ ధర రూ.325గా ముద్రించారు. ఇది సుమారు 2,841 శాతం మార్క్ అప్ సమానం. అదేవిధంగా రూ.6.75కు కొనుగోలు చేసిన ఒక ఇంజెక్షన్ సిరంజీపై రూ.57.20 MRP ఉంది. రూ.29.41కు కొనుగోలు చేసిన ఒక క్యాథెటర్పై రూ.310 MRP ఉంది.
ఈ ఉదాహరణలు కొనుగోలు ధర, MRP మధ్య ఉన్న భారీ తేడాను చూపిస్తున్నాయి.
మెడికల్ కన్స్యూమబుల్స్ చాలాసార్లు చికిత్సలో తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. అందువల్ల రోగులు వాటి ధరలను ఇతర చోట్ల సులభంగా పోల్చుకోలేరు. అత్యవసర చికిత్స సమయంలో ప్రత్యామ్నాయాలను వెతకడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అసలు ట్రేడ్ ధర ఎంతనేది కూడా రోగులకు సాధారణంగా తెలియదు.
ఈ సమాచార లోపం ప్రజారోగ్యానికి సంబంధించిన అంశమని ముండే పేర్కొన్నారు.
తయారీదారులు, పంపిణీదారుల స్థాయిలోనే MRP నిర్ణయిస్తారని ముండే తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఈ MRP ట్రేడ్ ధర కంటే చాలా ఎక్కువగా ఉండవచ్చని చెప్పారు. దీంతో రోగులు తమ బిల్లులోని ఛార్జీలను అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. బిల్లులు చెల్లించే వారికి ఉత్పత్తుల అసలు ధరపై తగిన సమాచారం ఉండదు. దీంతో ఏమీ చేయలేని స్థితిలో వారు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.
డ్రగ్స్ (ప్రైసెస్ కంట్రోల్) ఆర్డర్, 2013 కింద షెడ్యూల్డ్ మందులకు ధర పరిమితులు ఉన్నాయి. అయితే అనేక మెడికల్ పరికరాలు, కన్స్యూమబుల్స్కు ఇలాంటి నియంత్రణలు ఉండవు.
దీంతో వాటి ధరలు, రోగులకు అందే ధర సమాచారం విషయంలో నియంత్రణ పరిమితంగా ఉంటుంది.
Also Read: ఫోన్ చోరీ అయిందా? మీ బ్యాంక్ ఖాతాను కాపాడేందుకు వెంటనే ఈ 5 పనులు చేయండి
సర్వే వివరాలను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలను సిఫారసు చేసినట్లు ముండే తెలిపారు. ట్రేడ్ ధర, ప్రకటించిన MRP మధ్య అనుమతించదగిన వ్యత్యాసంపై స్పష్టమైన మార్గదర్శకాలు సూచించారు.
ఈ ధరల విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, NPPAకి తన రెకమండేషన్స్ పంపినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి చర్యలు ధరలతో పాటు రోగులకు ఉన్న సమాచార లోపాన్ని కూడా తగ్గించవచ్చు.
Also Read: ఆసుపత్రి బిల్లు తగ్గాలంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ 5 అంశాలు తప్పనిసరి.. మీ పాలసీలో ఉన్నాయా?
మహారాష్ట్రలో FDA తనిఖీలు చేపడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు, ఇతర చోట్ల అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఆసుపత్రి మెడికల్ వస్తువుల ధరలపై ముండే చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి.