Strait of Hormuz Toll: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం మెుదలైనప్పటి నుంచి ప్రపంచ దేశాల దృష్టి హర్ముజ్ జలసంధిపై పడింది. చమురు, గ్యాస్ రవాణాకు ప్రధాన మార్గంగా ఈ హర్ముజ్ ను ప్రస్తుతం ఇరాన్ నియంత్రిస్తోంది. ప్రత్యర్థి దేశాలతో పాటు తనకు వ్యతిరేకంగా ఉన్న కంట్రీల నౌకలను ఆ జలసంధి గుండా వెళ్లనివ్వకుండా అడ్డుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ప్రయాణించే నౌకలపై భారీగా టోల్ ను ఇరాన్ పెంచేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీంతో ఒక్కసారిగా హర్ముజ్ జలసంధి టోల్ వ్యవస్థ గురించి చర్చ మెుదలైంది.
షిప్పింగ్ న్యూస్ వెబ్సైట్ లాయిడ్స్లిస్ట్ రాసిన కథనం ప్రకారం.. ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గంలో ‘టెహ్రాన్ టోల్ బూత్’ (Tehran Toll Booth) ప్రవేశపెట్టింది. ఈ టోల్ గుండా ప్రయాణించాలంటే.. అంతర్జాతీయ నౌకలు తమ పూర్తి పత్రాలను సమర్పించి క్లియరెన్స్ కోడ్ పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భారీ మెుత్తంలో రుసుమును సైతం చెల్లించుకోవాల్సి ఉంటుందని సదరు కథనం పేర్కొంది. యుద్ధానికి కావాల్సిన ఖర్చులను ఇరాన్ ఈ విధంగా టోల్ రూపంలో వసూలు చేస్తుందన్న విమర్శలు అంతర్జాతీయంగా వినిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. కొన్ని వాణిజ్య నౌకల నుండి ఇరాన్ దాదాపు 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.16 – 18 కోట్లు) వరకు రుసుము వసూలు చేస్తోంది. నౌక రకం (ఆయిల్ ట్యాంకర్, గ్యాస్ ట్యాంకర్).. అందులోని సరుకు విలువ, ఏ దేశానికి వెళ్తోందన్న అంశాలను బట్టి టోల్ రుసుమును ఇరాన్ నిర్ణయిస్తనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also Read: BSNL CNAP Feature: BSNL సరికొత్త ఫీచర్.. Unknown కాల్స్.. ఎవరు చేశారో ఇట్టే తెలిసిపోద్ది!
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా కొన్ని దేశాలకు చెందిన నౌకలను మాత్రమే ఇరాన్ అనుమతి ఇస్తోంది. భారత్, చైనా, రష్యా వంటి మిత్ర దేశాలకు మాత్రమే సులభతరమైన ప్రయాణానికి వీలు కల్పిస్తుంది. అయితే భారత్ సైతం ఇరాన్ కు టోల్ చెల్లిస్తోందన్న ప్రచారం జరిగినప్పటికీ.. భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ (Ministry of Shipping) వాటిని తోసిపుచ్చింది. ‘భారత నౌకలు ఎలాంటి టోల్ చెల్లించడం లేదు. అసలు అలాంటి రుసుము వసూలు చేయడానికి చట్టబద్ధమైన ఆధారం లేదు’ అని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
హర్మూజ్ జలసంధి విషయానికి వస్తే.. ఇది పర్షియన్ గల్ఫ్ – గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలుపుతుంది. దీని వెడల్పు కేవలం 33 కిలోమీటర్ల మాత్రమే కావడం విశేషం. ఆ ఇరుకైన మార్గం గుండానే అంతర్జాతీయ నౌకలు ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సముద్రం ద్వారా జరిగే వాణిజ్యంలో 20-30 శాతం ఈ మార్గం గుండానే జరుగుతుంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 40 శాతం, సహజ వాయువు (LNG)లో సగం ఈ జలసంధి గుండానే వస్తోంది.