Thyrocare Velumani: థైరోకేర్ డయాగ్నోస్టిక్స్ ను రూ.5,000 కోట్ల సంస్థగా తీర్చిదిద్దిన డాక్టర్ వేలుమణి.. తన జీవితంలో మారడానికి పేదరికమే కారణమని చెప్పారు. తన విద్యార్థి రోజులు, కెరీర్ గురించి గురించి ఆలోచిస్తూ.. రైల్వే ప్లాట్ఫామ్పై ఎక్కువ సమయం గడిపిన రోజులను ఆయన గుర్తుచేసుకున్నారు. స్వీయ క్రమశిక్షణతో శాస్త్రవేత్త, కంపెనీ వ్యవస్థాపకుడిగా తాను ఎలా ఎదిగారో ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
రైల్వేలో ఏడాదికి ఇచ్చే రూ.7 పాస్ తన జీవితాన్ని, కెరీర్ను మార్చడానికి కీలక పాత్ర పోషించిందని డాక్టర్ ఎ. వేలుమణి చెప్పారు. తన విద్యార్థి ఉన్న సమయంలో రైల్వే ప్లాట్ఫామ్పైనే ఎక్కువగా చదువుకునే వాడినని చెప్పారు. ఇప్పుడు తన 66 ఏళ్ల ప్రయాణాన్ని మళ్లీ గుర్తుచేసుకుంటున్నానన్నారు. ప్రయాణాలు, తక్కువ ఫీజులు తన జీవితాన్ని ప్రభావితం చేయాని వేలుమణి చెప్పారు.
1974 నుంచి 1978 వరకు, తాను కోయంబత్తూరు సమీపంలోని శ్రీ రామకృష్ణ మిషన్ విద్యాలయంలో చదువుకున్నానని వేలుమణి చెప్పారు. సిటీలోని కాలేజీల్లో నెలకు రూ. 1,000 నుండి రూ. 3,000 వరకు ఫీజులు, హాస్టల్ ఖర్చులు నెలకు రూ. 200 వరకు ఉండేవని గుర్తుచేసుకున్నారు. సిటీకి 25 కి.మీ దూరంలో ఉన్న రామకృష్ణ మిషన్ కాలేజీలో ఫీజు రూ. 300, హాస్టల్కు నెలకు రూ. 75 అయ్యేదన్నారు. ఆ మొత్తం కూడా తనకు భారంగా ఉండేదన్నారు. హాస్టల్ ఫీజు కట్టుకోలేక, ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ…రోజూ కాలేజీకి రైలు ప్రయాణం చేసేవాడనని చెప్పారు.
అప్పట్లో బస్సు టికెట్ ధర ఒక వైపుకు 60 పైసలు, నెలకు దాదాపు రూ. 30 అయ్యేది. ఆ ఖర్చు భారంగా అనిపించి, ప్యాసింజర్ రైలులో ప్రయాణించేవాడిని వేలుమణి చెప్పారు. విద్యార్థి రైలు పాస్ ఏడాదికి రూ.7 ఉండేదని చెప్పారు.
రైలులో ఉదయం 5:50 గంటలకు బయలుదేరి గం.6:25లకు కాలేజీ ఉండే ఊరుకు చేరుకునేవాడిని, సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరి 6:45 గంటలకు తిరిగి నగరానికి వచ్చేవాళ్లం. కాలేజీ ఉదయం 9:00 గంటలకు మొదలయ్యేది. ఉదయం 6:30 నుండి 9:00 గంటల వరకు, సాయంత్రం రైలు ఎక్కే వరకు ఆరు గంటల పాటు రైల్వే ప్లాట్ ఫామ్ పైనే ఉంటూ చదువుకునే వాడినని వేలుమణి చెప్పారు. ప్లాట్ఫామ్పై కూర్చుని మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుకునేవాడనని చెప్పారు. తన విజయానికి ఇదొక కారణమన్నారు. ప్లాట్ ఫామ్ పై తన 1000 రోజులు, 6000 గంటల కష్టానికి BARCలో ఉద్యోగం రావడానికి సహాయపడిందన్నారు. ఇదే తన జీవితంలో కీలక మలుపు అన్నారు.
చాలా ఏళ్లుగా తమ కుటుంబంలో తల్లి మాత్రమే సంపాదించేవారిని గుర్తుచేశారు. ఆమె రోజుకు రూ.3 సంపాదించేవారు. ఆ సంపాదనపై కుటుంబం మొత్తం ఆధారపడేదని వేలుమణి చెప్పారు. తన చదువు పూర్తి చేయడానికి, కళాశాల ఫీజులకు ఆమె నాలుగు బంగారు గాజులు అమ్మిందని వేలుమణి గుర్తుచేశారు. ‘అదృష్టవశాత్తూ నేను పేదవాడిని’.. అదే తనకు జీవిత పాఠాలు నేర్పిందన్నారు. విద్యార్థి జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు కెరీర్, వ్యాపారం పట్ల తన ఆలోచనను రూపొందించాయని వేలుమణి చెప్పారు. 2015లో.. తన భార్యను అదే రైల్వే ప్లాట్ఫామ్కు తీసుకెళ్లి.. “ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఒక శాస్త్రవేత్తను ఎలా తయారు చేసిందో” ఆమెకు చెప్పానన్నారు.
సంవత్సరాల తరబడి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత, తాను మూడు స్పష్టమైన విషయాలను గమనించానని వేలుమణి అన్నారు. ‘ఫ్రెషర్లను నియమించుకోవడం సులభం, వారితో పెద్దగా సవాళ్లు ఎదురుకావు. కెరీర్ మధ్యలో ఉన్న వాళ్లు నేరుకోవడం మానేస్తారు. చాలామంది 20 సంవత్సరాల అనుభవం ఉందని చెబుతారు, కానీ 10 ఏళ్లే నిజంగా కష్టపడతారు. మూడో వర్గం 10 సంవత్సరాలు పనిచేసి ఉండవచ్చు, కానీ నిరంతరం నేర్చుకుంటారు. 20 ఏళ్ల నాలెడ్జ్ సొంతం చేసుకుంటారు’ అని వేలుమణి అన్నారు.
వేలుమణి ఉద్యోగాలు, కెరీర్ల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని చెప్పారు. ఉద్యోగాలు ముందుగా డబ్బును తెస్తాయి. కెరీర్ తరువాత ఫలితాలను ఇస్తాయి. ఒక ఉద్యోగం చేస్తే 20 ఏళ్లు పాటు సౌకర్యవంతంగా ఉంచవచ్చు. కెరీర్ 60 ఏళ్ల పాటు తన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుతుంది. అందుకే 20 ఏళ్లు విశ్రాంతి కోసం కాదు, 60 ఏళ్ల కెరీర్ కోసం కష్టపడాలని ఆయన చెప్పారు. కంఫర్ట్ జోన్లు ప్రమాదకరం, ప్రస్తుతం అవి హాయిగా ఉంటాయి. ఏదైనా కష్టం ఎదురైతేనే నిజమేంటో అర్థం అవుతుందన్నారు. రూ. 7 రైలు పాస్ నుంచి రూ. 5,000 కోట్ల కంపెనీ వరకు.. తన ప్రయాణం, చిన్న త్యాగాలు తన జీవితాన్ని ఎలా మార్చాయో వేలుమణి చెప్పారు.
Also Read: రూ.35 వేల పెట్టుబడి.. ఇప్పుడు రూ.36 కోట్ల రాబడి, 23 ఏళ్ల యువకుడి సక్సెస్ సీక్రెట్ ఇదే!