Recharge Plans: ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా వంటి టాప్ టెలికాం సంస్థలు.. తమ యూజర్ల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులో వచ్చాయి. అయితే ప్రధానంగా మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ ఎవరికీ అర్థం కానీ అంశంగా నిలుస్తుంటుంది. సాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటాయి. కానీ నెలవారీ రీఛార్జ్ ప్లాన్స్ ను 28 రోజుల వ్యాలిడిటీకే టెలికాం సంస్థలు అందిస్తుంటాయి. అయితే దీని వెనకున్న అసలు కారణం ఏంటీ? దీనిపై ట్రాయ్ ఏమైనా చర్యలు తీసుకుందా? లేదా? అన్న దానిని ఈ కథనంలో పరిశీలిద్దాం.
టెలికాం కంపెనీలు (Jio, Airtel, Vi) నేరుగా ధరలు పెంచకుండా.. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనుసరిస్తున్న తెలివైన వ్యూహంగా దీనిని చెప్పవచ్చు. సాధారణంగా ఏడాదికి 365 రోజులు ఉంటాయి. మీరు 28 రోజుల చొప్పున రీఛార్జ్ చేస్తే (28 x 13 = 364) అవుతుంది. అంటే ఏడాది పూర్తి కావడానికి 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. దీని ప్రకారం కస్టమర్ ఏడాదికి 12 నెలలకు బదులు.. 13 నెలల డబ్బులు చెల్లిస్తున్నాడన్నమాట. దీనివల్ల కంపెనీలకు రూ.వేల కోట్ల రూపాయాల అదనపు లాభం వస్తుంది.
సాధారణంగా టెలికాం కంపెనీలు.. 28 రోజులతో పాటు 30 రోజుల మంత్లీ ప్లాన్స్ ను సైతం అందుబాటులో ఉంచాయి. కానీ 30 డేస్ ప్లాన్ తో పోలిస్తే.. 28 రోజుల ప్లాన్స్ చూడగానే చాలా తక్కువ ధర అన్న భ్రమను కస్టమర్లకు కల్పిస్తాయి. ఇందుకు అనుగుణంగానే కంపెనీలు 30 రోజుల ప్లాన్ కంటే తక్కువకు 28 రోజుల రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులో ఉంచుతాయి. పైగా వీటినే ఎక్కువగా ప్రమోట్ చేస్తుంటాయి. దీంతో రెండ్రోజులది ఏముందిలే అని కస్టమర్లు సైతం.. 28 రోజుల ప్లాన్ కే మెుగ్గు చూపుతున్నారు.
ఈ అంశంలో భారత ప్రభుత్వం పూర్తిగా మౌనంగా లేదు. వినియోగదారుల నుండి వచ్చిన అనేక ఫిర్యాదుల మేరకు భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) రంగంలోకి దిగి 2022లోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. TRAI అన్ని టెలికాం కంపెనీలను (Jio, Airtel, Vi) కనీసం ఒక ప్లాన్ అయినా 30 రోజుల వాలిడిటీతో ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునేలా ఒక ప్లాన్ను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. TRAI ఆదేశాల తర్వాత అన్ని కంపెనీలు 30 రోజుల వాలిడిటీ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. అదే సమయంలో తమ ఇతర ప్లాన్లను (ఉదాహరణకు 28, 56, 84 రోజులు) కొనసాగిస్తూ వస్తున్నాయి. పైగా ఈ 30 రోజుల ప్లాన్ల ధరలు, 28 రోజుల ప్లాన్ల కంటే ఎక్కువగా ఉండేలా వ్యూహత్మంగా కంపెనీలు వ్యవహరిస్తున్నాయి.
Also Read: Shoaib Akhtar: కావ్య పాప కాదు, ఆమె పాకిస్థాన్ కాటేరమ్మ..దండేసి, దండం పెట్టాల్సిందే
ఇటీవల రాజ్యసభలో ఎంపీ రాఘవ్ చద్దా టెలికాం సంస్థల మోసం గురించి గట్టిగా ప్రశ్నించారు. 28 రోజులని ‘నెలవారీ ప్లాన్’ అని పిలవడం వినియోగదారులను మోసం చేయడమేనని అన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రీపెయిడ్ ప్లాన్ గడువు ముగిసిన వెంటనే అవుట్ గోయింగ్ తో పాటు ఇన్ కమింగ్ కాల్స్ ను సైతం టెలికాం కంపెనీలు నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దీని వల్ల సామాన్యులు, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వలస కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నట్లు చెప్పారు. మెుత్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ యువ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నలతో.. టెలికాం కంపెనీల మోసపూరిత ప్లాన్స్ గుట్టు మరోమారు రట్టయ్యింది.
Also Read: Panchayat Funds: గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు విడుదల చేసిన కేంద్రం