Electricity Charge: స్వేచ్ఛ బ్యూరో : విద్యుత్ డిమాండ్ ను బట్టి చార్జీలు వసూలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేయనుంది. ఈమేరకు విద్యుత్ వినియోగదారుల హక్కుల నిబంధనలను సవరిస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ముసాయిదాను రిలీజ్ చేసింది. విద్యుత్ వినియోగదారుల హక్కుల నిబంధనల సవరణ వల్ల టైం ఆఫ్ డే చార్జీలు అమలవ్వనున్నాయి. విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే సమయాల్లో తక్కువ చార్జీలు, డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో(పీక్ అవర్స్) సాధారణం కంటే ఎక్కువ చార్జీలు వసూలు చేసే విధానం అమల్లోకి రానుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉండే సమయాల్లో వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా వినియోగదారులు తక్కువ విద్యుత్ ధరల ప్రయోజనాన్ని పొందేలా చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు 2027 ఏప్రిల్ 1 నుంచి టైం ఆఫ్ డే టారిఫ్ అమలవ్వనుంది. వ్యవసాయం మినహా ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆధారంగా సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించిన తేదీ నుంచి అమలవ్వనుంది. అయితే, ఇది 1 ఏప్రిల్, 2028 కంటే ఆలస్యం కాకూడదని నిబంధనల్లో కేంద్రం స్పష్టంచేసింది. కాగా ఇప్పటికే స్మార్ట్ మీటర్లు ఉన్న వినియోగదారులకు, అవి అమర్చిన వెంటనే టైం ఆఫ్ డే టారిఫ్ వర్తించనుందని ముసాయిదాలో పేర్కొన్నారు.
విద్యుత్ వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేస్తూ, గ్రిడ్ స్థిరత్వం, పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం సవరించిన నిబంధనల ద్వారా అటు వినియోగదారులకు మేలు చేయడంతో పాటు, విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని చెబుతున్నారు. 5 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న సోలార్ సిస్టమ్స్పై ‘నెట్ మీటరింగ్ ఫెసిలిటీ ఛార్జీలు’ విధించాలని ప్రతిపాదించారు. 5 కిలోవాట్ల వరకు ఉన్న చిన్న వినియోగదారులకు ఈ చార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇకపోతే 500 కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల రూఫ్-టాప్ సోలార్ వ్యవస్థలను కలిగి ఉన్న వారు ఇకపై ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్(బ్యాటరీలు) ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి అనే నిబంధనను అమలుచేయనున్నారు. దీనివల్ల పగలు ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్ను రాత్రి వేళల్లో వాడుకోవడానికి వీలవ్వనుంది.
Also Read: Panchayat Funds: గ్రామ పంచాయతీలకు మరో రూ.640 కోట్లు విడుదల చేసిన కేంద్రం
ప్రస్తుతం మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం 3 రోజుల గడువు ఉండగా, ఇకపై అన్ని మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లోనూ 3 రోజుల్లోనే కొత్త కనెక్షన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇది పట్టణ ప్రాంత వినియోగదారులకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే అనేక ప్రధాన నగరాలు అధికారికంగా మెట్రోపాలిటన్ గా గుర్తించబడకపోవడం వల్ల, అక్కడ జనాభా సాంద్రత, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ కనెక్షన్ కోసం 7 రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోంది. ఈ వ్యత్యాసాన్ని తొలగించడానికి ఈ సవరణ చేస్తున్నారు. అలాగే తప్పుడు బిల్లులకు చెక్ పడేలా సవరణలు చేపట్టారు. వినియోగదారుడి గత 6 నెలల సగటు వినియోగం కంటే 5 రెట్లు ఎక్కువ బిల్లు వచ్చినా, లేదా ఆరో వంతు కంటే తక్కువ వచ్చినా.. డిస్కంలు స్వయంగా ఆ కేసును 30 రోజుల్లోపు సమీక్షించి పరిష్కరించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. సమీక్ష పూర్తయ్యే వరకు వినియోగదారుడు కేవలం సగటు బిల్లు చెల్లిస్తే సరిపోతుంది, విద్యుత్ కనెక్షన్ను తొలగించకూడదని స్పష్టంచేసింది.
విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి పలు సవరణలు చేపట్టారు. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలను(సీజీఆర్ఎఫ్) సరళతరం చేశారు. కేవలం రెండు స్థాయిల వ్యవస్థను(కంపెనీ స్థాయి, జిల్లా/మున్సిపాలిటీ స్థాయి) ప్రతిపాదించారు. ఫిర్యాదులను గరిష్టంగా 45 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ఈ ముసాయిదాపై అభిప్రాయాలను ఏప్రిల్ 11 లోపు rr1-mop@gov.in అనే మెయిల్ కు పంపించాలని సూచించారు. కాగా ఈ సవరణలు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సవరణలు వినియోగదారులకు మరింత సౌకర్యాన్ని కల్పించడంతో పాటు, విద్యుత్ బిల్లులను తగ్గించుకునే అవకాశాన్ని టైం ఆఫ్ డే టారిఫ్ ద్వారా కల్పించనున్నాయని ముసాయిదాలో పేర్కొన్నారు.
Also Read: Karthika Deepam 2 Serial Today march 14th: ‘కార్తీక దీపం 2’ సీరియల్: దశరథపై సీరియస్ అయిన కాంచన