Banjara Hills Student Suicide: హైదరాబాద్ లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కేవలం సెల్ఫోన్ వాడొద్దని తండ్రి మందలించినందుకు ఒక చిన్నారి తన నిండు నూరేళ్ల ప్రాణాలను బలి తీసుకున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లోని ఫస్టాన్సర్.. సయ్యద్ నగర్లో నివసించే మహ్మద్ అఫాన్ ఖాన్ (12) సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో ఆ బాలుడు మారుతల్లి వద్ద పెరుగుతున్నాడు. తండ్రి ఇర్ఫాన్ ఖాన్ వాల్ పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు.
అఫాన్ ఖాన్ కొంతకాలంగా సెల్ఫోన్ వ్యసనానికి లోనయ్యాడు. నిరంతరం ఫోన్లో వీడియోలు చూడటం.. గేమ్స్ ఆడటం చేస్తూ చదువును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాడు. తండ్రి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఫోన్ చూస్తూ పాఠశాలకు డుమ్మా కొడుతుండటంతో అఫాన్ను ఇప్పటికే మూడు పాఠశాలలు మార్చాల్సి వచ్చింది. మంగళవారం కూడా పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వీడియో గేమ్స్ చూస్తుండటంతో తండ్రి ఇర్ఫాన్ ఖాన్ గట్టిగా మందలించాడు. ఫోన్ పక్కన పెట్టి స్కూల్కు క్రమం తప్పకుండా వెళ్లాలని తండ్రి చేసిన హెచ్చరికను ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు.
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇర్ఫాన్ ఖాన్ తన భార్యతో కలిసి బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అఫాన్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్న బాలుడు ఒక చీర సహాయంతో ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంత్యక్రియలు ముగించుకుని తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు అఫాన్ స్థితిని చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కన్నబిడ్డ ప్రాణం లేని స్థితిలో ఉండటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
ఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొబైల్ ఫోన్ వ్యసనం ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. చిన్న వయసులోనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని.. మొబైల్ వాడకంపై నియంత్రణ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Chhattisgarh: మావోలకు మరో ఝలక్.. ఎన్కౌంటర్లో మరో ఇద్దరు హతం..