Rajasthan: కారణాలు ఏమైనా కావచ్చు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నలుగురు కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా చంపింది ఆ మహిళ. పైగా హత్యలను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. ఏకంగా మృతదేహాలను ఓ స్కార్పియో వాహనంలో ఉంచి నిప్పుపెట్టింది. సంచలనం రేపిన ఈ ఘటన రాజస్థాన్లో వెలుగు చూసింది. అసలేం జరిగింది?
రాజస్థాన్ లోని ఆజ్మీర్ సిటీలో దారుణమైన ఘటన
రాజస్థాన్లోని అజ్మీర్ నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని శ్రీరాంపురా గ్రామంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. ఆదివారం ఉదయం మాజీ సర్పంచ్ ఇంటికి దాదాపు 500 మీటర్ల సమీపంలోని హైవేపై కాలిపోతున్న స్కార్పియో కారుని గ్రామస్తులు గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమీపంలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనా స్థలానికి పోలీసులు చేసుకునే సమయానికి ఎస్యూవీలో కాలిపోయిన మూడు మృతదేహాలు కనిపించాయి. సమీపంలోని పంట పొలంలో పాక్షికంగా కాలిన మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతులు మాజీ సర్పంచ్ రామ్సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్య గ్యాన్ దేవి, వారి బంధువు మహిమా చౌదరిగా గుర్తించారు.
అత్తింటి ఫ్యామిలీని చంపి, కారులో వేసి తగలబెట్టిన మొదటి భార్య
కారు ఘటనను తొలుత ప్రమాదంగా భావించారు పోలీసులు. కేసు విచారణలో దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఫామ్హౌస్లో రక్తపు మరకల ఆనవాళ్లు కనిపించాయి. దీంతో పక్కా ప్రణాళికతో చేసిన హత్యేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో ఆ ఇంటి కుటుంబసభ్యురాలు, నిందితురాలిని స్టేషన్కు పిలిచి విచారించారు పోలీసులు. దర్యాప్తులో ఊహించని నిజాలు బయటకువచ్చాయి.
రామ్సింగ్ మొదటి భార్య సునీత, మైనర్ కొడుకు, కూతురితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన వెనుక కొత్త కొత్త విషయాలు బయటకు వచ్చాయి. చాన్నాళ్లుగా రామ్సింగ్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం సునీత తోపాటు అంతా ఫామ్ హౌస్కి వెళ్లారు. ప్లాన్ ప్రకారం సునీత అక్కడ అంతా రెడీ చేసుకుంది.
వ్యవసాయానికి ఉపయోగించే పదునైన ఆయుధాలతో నలుగురి గొంతులు కోసి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాలను వాహనంలోకి ఎక్కించి కొంత దూరం వెళ్లిన తర్వాత నిప్పంటించినట్లు దర్యాప్తులో తేలింది. నిందితురాలు పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో డిజిటల్ ఆధారాలు, ఫోరెన్సిక్ నివేదికలతో కేసు వేగంగా ఛేదించినట్లు అజ్మీర్ పోలీసులు తెలిపారు.
ALSO READ: హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీ కొట్టిన కారు, ఆపై నుజ్జు నుజ్జు
అంతకుముందు కుటుంబంలోని నాలుగు హత్యలు ప్రత్యర్థులు చేసినట్టు నాటకం ఆడింది. నెత్తి నోరూ బాదుకుంటూ నటించే ప్రయత్నం చేసింది. గ్రామంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబంలో ఇంతటి దారుణం జరగడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మాజీ సర్పంచ్ భార్య, కూతురు, కొడుకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
వీరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రామ్ సింగ్కు ఇద్దరు భార్యలు. ఈ విషయంపై కుటుంబంలో వివాదం నడుస్తోంది. విచారణలో మొదటి భార్య,పిల్లలు.. కుటుంబ పెద్ద, అతని తల్లితో విభేదించి గొడవపడినట్లు తేలింది.