Allipudi Murder Case: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ పరిధిలోని అల్లిపూడి గ్రామంలో జరిగిన తెలుగుదేశం పార్టీ(తెదేపా) కార్యకర్త లాలం బంగారయ్య (38) కిరాతక హత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి తాజాగా 12 మంది నిందితులను అరెస్టు చేశారు. పాతకక్షలతో పాటు రాజకీయ విద్వేషాల నేపథ్యంలో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించి అరెస్టయిన నిందితులను పోలీసులు బహిరంగంగా నడిపించుకుంటూ తుని కోర్టుకు తరలించడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
జనవరి 16 (కనుమ పండుగ) రాత్రి అల్లిపూడి గ్రామంలో తెదేపా, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో సుమారు 50 మంది వైసీపీ శ్రేణులు కత్తులు, రాడ్లు, బ్లేడుల వంటి మారణాయుధాలతో తెదేపా కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లాలం బంగారయ్య తుని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో కార్యకర్త చింతకాయల శ్రీరామ్మూర్తి పరిస్థితి ఇప్పటికీ విషమంగా ఉండగా, కాకినాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ హత్య వెనుక వైసీపీ నాయకుడు చింతకాయల చినబాబు ప్రోద్బలం ఉందని పోలీసులు నిర్ధారించారు. ఆయనను A-1 గా నమోదు చేయగా, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయనను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ఘటనపై తుని గ్రామీణ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే అరెస్టు చేసిన 12 మందిని రిమాండ్కు తరలించగా, మరికొందరు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ అమలులో ఉంది. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ దాడిని తుని ఎమ్మెల్యే యనమల దివ్య తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయంగా బలహీనపరచాలనే ఉద్దేశంతోనే ముందస్తు ప్రణాళికతో ఈ హత్యకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని ఒక వస్త్ర దుకాణం విషయంలో ఇటీవల జరిగిన స్వల్ప వివాదమే ఈ స్థాయి ఘర్షణకు దారితీసినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Fact Check: 9 ఏళ్ల చెల్లికి కడుపు చేసిన 11 ఏళ్ల అన్న.. ఆమె చేతిలో బిడ్డ ఎవరు? నిజం ఏంటీ?