Vijayawada News: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ వార్తల్లోకి వచ్చేశాడు. పోలీసుల చెర నుంచి తప్పించుకున్న ఈ నిందితుడు ఇప్పుడెక్కడున్నాడు? వాడు పారిపోవడానికి పోలీసులు సహకరించారా? వేరే రాష్ట్రం నుంచి వచ్చిన నిందితుడు ఎలా తప్పించుకున్నాడు? పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందా? ఇతగాడి కోసం వేట మొదలుపెట్టారు ఏపీ పోలీసులు.
పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు మోస్ట్వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్. విజయవాడ కోర్టు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దుద్దుకూరు దాబా దగ్గర భోజనం కోసం ఆగిన సమయంలో ప్రభాకర్ పరారీ అయినట్టు రాజమండ్రి పోలీసులు చెబుతున్నారు.
ఏపీ పోలీసుల చెర నుండి తప్పించుకున్న నిందితుడు బత్తుల ప్రభాకర్.. హైదరాబాద్లోని ప్రిజమ్ పబ్బు కాల్పుల కేసులో కీలక వ్యక్తి. కేసుల నిమిత్తం హైదరాబాద్ నుండి పీటీ వారెంట్ మీద ఏపీకి తీసుకెళ్లారు పోలీసులు. బత్తులపై తెలంగాణ, ఏపీల్లో అనేక కేసులున్నాయి. గతంలో బత్తుల ప్రభాకర్ వద్ద 500కు పైగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు.
అంతేకాదు ప్రభాకర్ శరీరంపై వెరైటీగా మూడు టాటూలు ఉన్నాయి. ప్రభాకర్ పోలీసుల నుంచి తప్పించుకున్నప్పుడు ఓ చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయని తెలిపారు. వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు ఈ నెంబర్లకు తెలియజేయాలని రాజమండ్రి పోలీసు తెలిపారు. 9440796584, 9440796624 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ALSO READ: బెంగుళూరులో దారుణం.. కూతురి ముందు భార్యని చంపిన భర్త
అంతేకాదు సమాచారం చెప్పినవారికి తగిన పారితోషికం ఇస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ సిటీ పోలీసు కమిషనర్ రాజశేఖర్బాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్నవారు నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. నిందితుడు తప్పించుకోవడానికి కారణమైన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్టు తెలియజేశారు.
ప్రభాకర్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ముద్దాయి కోసం పట్టుకునేందుకు కృష్ణా, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి పోలీసులతో సమన్వయం చేసుకోవాలని పోలీసులకు సూచన చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతాడు నిందితుడు. విలాసవంతమైన జీవితం గడుపుతాడు.
పబ్ల్లో తిరగడం, ఖరీదైన అపార్టుమెంట్లో జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల కిందట ప్రిజమ్ పబ్లో ప్రభాకర్ ను పట్టుకునే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు కూడా. అయినప్పటికీ నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రభాకర్ రూ. 300 కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నాడు.
ఏపీ పోలీసుల అజాగ్రత్త వల్లే ఇదంతా జరిగిందని అంటున్నారు. ప్రభాకర్ పై తెలంగాణ పోలీసులు ఫోకస్ చేశారు. గతంలో పట్టుకునే సమయంలో పోలీసులకు ఆఫర్లు ఇవ్వడం, చెప్పిన మాట వినకుంటే గన్తో ఫైరింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా తప్పించుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి కూడా.