Rajendranagar Accident: రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉదయం 7.30 గంటల సమయంలో షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు బయలుదేరింది. ఆరాంఘర్ చౌరస్తా సమీపానికి చేరుకున్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద.. వెనుకనుంచి అధిక వేగంతో వస్తున్న డీసీఎం వాహనం ఢీకొట్టింది.
ఈ నేపథ్యంలో బస్సులో ప్రయాణిస్తున్న వారు ఒక్కసారిగా భయాందోళన చెందారు. కొందరు ప్రయాణికులు కిందపడిపోయి స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు ఆపి, అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. కొన్ని కిటికీ గాజులు పగిలిపోయి బస్సుకు నష్టం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు, డీసీఎం వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్ను సవ్యంగా కొనసాగించారు. ప్రారంభ దర్యాప్తులో డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. డీసీఎం డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. డ్రైవర్ను కస్టడీలోకి తీసుకొని మద్యం సేవించి డ్రైవింగ్ చేశారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.
Also Read: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి.. భయాందోళనలో గ్రామస్థులు
ఆర్టీసీ బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో నలుగురికి స్వల్ప గాయాలు కాగా, మిగతావారు ప్రాణాపాయం నుండి బయటపడ్డారని వైద్యులు తెలిపారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.