Road Accident: కలియుగ వైకుంఠం తిరుమల గిరుల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీవారి దర్శనం ముగించుకుని కొండ దిగుతున్న క్రమంలో, మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. తమిళనాడుకు చెందిన వీరిద్దరూ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన నటరాజన్, మురళి అనే ఇద్దరు వ్యక్తులు తమ బైక్పై కిందకు వస్తుండగా, ఒక్కసారిగా వాహనం అదుపు తప్పింది. అతివేగంగా వెళ్తున్న బైక్ నేరుగా రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ధాటికి ఇద్దరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో పాటు, తీవ్ర రక్తస్రావం జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన తోటి భక్తులు, టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన నటరాజన్ దురదృష్టవశాత్తు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మురళి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వెంటనే అంబులెన్స్లో అతడిని తిరుపతిలోని స్విమ్స్ (SVIMS) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్విమ్స్ అత్యవసర వార్డులో మురళికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Also Read: లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం.. స్పాట్లో 39 మంది, రాజంపేట పట్టణంలో ఘోరం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, అతివేగం లేదా బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడు, గాయపడిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, మలుపుల వద్ద వేగ నియంత్రణ పాటించాలని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.