RTC Bus Accident: విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం విజయనగరం జిల్లాలోని రాజాం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజాం నుంచి బయలుదేరి ప్రయాణికులతో వెళ్తుండగా, ఒక్కసారిగా డ్రైవర్కు ఫిట్స్ వచ్చింది.. దీంతో బస్సు అప్పన్నవలస వద్దకు చేరుకోగానే అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్తో కలిపి మొత్తం 87 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలవ్వగా, మరో 20 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ అప్పల గురువులు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు. అయితే తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
అయితే ప్రమాద వార్త తెలిసిన వెంటనే చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సీఐ శంకరరావు, గరివిడి ఎస్సై లోకేశ్వరరావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు సహాయక చర్యలను పర్యవేక్షించి, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. బస్సు అతివేగంతో ఉందా లేక ఎదురుగా ఏదైనా వాహనం వచ్చిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అప్పన్నవలస ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత, ఆందోళన నెలకొన్నాయి.
Also Read: మేడారం మహాజాతర.. కోట్లాది మంది భక్తుల కోసం ప్రపంచస్థాయిలో ఏర్పాట్లు
ఈ ఘటనపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బాధితులకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, క్రేన్ సహాయంతో పొలాల్లో పడిపోయిన బస్సును వెలికితీసే ప్రయత్నాలు ప్రారంభించారు.