CBI Arrest: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి మృతి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు కొడుకు, కూతురులను సీబీఐ అరెస్టు చేసింది. న్యాయస్థానం వారం రోజులపాటు వారిని సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఇంతకీ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరు? అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు కొడుకు, కూతురు అరెస్ట్
చిత్తూరు జిల్లా రాజకీయ నేత దివంగత డీకే ఆదికేశవులు నాయుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎంపీగా, టీటీడీ ఛైర్మన్ గా ఆయన పని చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో ఆదికేశవులు నాయుడు కొడుకు శ్రీనివాస్, కూతురు కల్పజ, డీఎస్పీ మోహన్ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్ష్యాలను నాశనం చేయడం వంటి ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన రఘునాథ్..ఏపీ, కర్ణాటకలో భూములు అమ్మడం, కొనడం చేసేవారు. బెంగుళూరులో ఆయన నివాసం ఉంటున్నారు. మరి ఏం జరిగిందో తెలీదు. సరిగ్గా 2019 మే 14న బెంగళూరు వైట్ ఫీల్డ్లోని ఓ గెస్ట్హౌస్లో ఉరి వేసుకున్నాడు. రఘునాథ్ భార్య మంజుల.. తన భర్తని కిడ్నాప్ చేసి చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యాపారవేత్త హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
ఆదికేశవుల నాయుడు కొడుకు శ్రీనివాస్, దామోదర్, రామచంద్రయ్య, ప్రతాప్ అనే వ్యక్తులను ప్రధానంగా ప్రస్తావించారు. ఈ కేసును అప్పట్లో ఇన్స్పెక్టర్గా వ్యవహరించిన మోహన్ కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలుపెట్టారు. రఘునాథ్ది ముమ్మాటికీ ఆత్మహత్య చేసుకున్నారని న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ మంజుల ఆ రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయించారు.
ఆ తర్వాత న్యాయస్థానం సిట్ను ఏర్పాటు చేసింది. చివరకు సిట్ కూడా ఆ తరహా నివేదిక ఇచ్చింది. మంజుల హైకోర్టు డివిజినల్ బెంచ్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ చెన్నై విభాగం ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా సోమవారం డీఎస్పీ మోహన్తోపాటు ఆదికేశవులు నాయుడు కొడుకు, కూతురులను అరెస్టు చేసింది.
ALSO READ: అన్నంలో విషం పెట్టి చంపి భార్య డ్రామాలు
రఘునాథ్కు చెందిన ఆస్తికి సంబంధించి నకిలీ వీలునామా రూపొందించారనేది అసలు పాయింట్. నిందితులను కోర్టు ముందు హాజరు పరిచినప్పుడు నిందితురాలు కల్పజ న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మరి సీబీఐ విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. ఉన్నట్లుండి ఆదిశేకవులునాయుడు కొడుకు, కూతురు అరెస్టు కావడంతో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అప్పుడే చర్చ మొదలైంది.