Challapalli: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ పేలుడు సంభవించింది. సీజ్ చేసిన బాణసంచాను తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పోలీస్ వాహనం పూర్తిగా దగ్ధం కావడమే కాకుండా.. పలువురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. వివిధ కేసుల్లో భాగంగా సీజ్ చేసిన భారీ మొత్తంలోని బాణసంచాను ఒక వాహనం నుండి మరోచోటికి తరలిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి బాణసంచా పేలడంతో.. అక్కడ నిలిపి ఉంచిన పోలీస్ జీపు క్షణాల్లోనే అగ్నికి ఆహుతైపోయింది. పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. స్టేషన్ లోపల ఉన్న ఫర్నీచర్ మొత్తం చిందరవందర అయిపోయింది. కిటికీల అద్దాలు పగిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో పడ్డాయి. దీంతో స్టేషన్ పరిసరాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.
ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఎస్ఐ, పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులుతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన జరిగిన వెంటనే చల్లపల్లి సీఐ కేఎస్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు క్లూస్ టీమ్ను రంగంలోకి దించారు. అగ్నిప్రమాదానికి బాణసంచా రాపిడి కారణమా లేక ఇతర సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతైన దర్యాప్తుకు ఆదేశించారు. నివాస ప్రాంతాలకు సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇలాంటి ప్రమాదం జరగడం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
Also Read: వార్ నాయనో.. ఆమె భార్యా? రాక్షసిలా? భర్త గొంతు కోసి.. రాత్రంతా అదే గదిలో!
https://twitter.com/bigtvtelugu/status/2038861007506808962