Chittoor Accident: చిత్తూరు జిల్లా పరిధిలోని శ్రీరంగరాజపురం బీసీ కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భానోదయ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా, ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన ఒక కంటైనర్ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న విద్యార్థులు భయాందోళనతో కేకలు వేయడంతో స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అయితే ఈ ప్రమాదంలో సుమారు 16 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు విద్యార్థుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పిల్లల తల్లిదండ్రులు ఈ వార్త విన్న వెంటనే ఆందోళనతో ఆసుపత్రుల వద్దకు చేరుకోవడంతో అక్కడ కంటతడి పెట్టించే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం చిత్తూరు – పుత్తూరు జాతీయ రహదారి పై ఉండటంతో, రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోయి కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాఠశాల బస్సు, కంటైనర్ లారీ రెండు వాహనాలు దెబ్బతిని రోడ్డు పైనే ఉండిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Also Read: ప్రియురాల్ని చంపేసి.. కొత్త స్టోరీ అల్లిన ప్రియుడు, తాండూరులో దారుణం
ప్రాథమిక సమాచారం ప్రకారం, కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్త, మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్కూల్ బస్సు ఫిట్నెస్, డ్రైవర్ల పరంగా ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.