Road Accident: ఓటు హక్కు వినియోగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య ప్రాణాలు కోల్పోగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, భూపాలపల్లి జిల్లాకు చెందిన దేవేందర్, అతని భార్య అపర్ణలు నర్సంపేటలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నర్సాపూర్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది.
రోడ్డుపై మలుపు వద్ద కారు వేగంగా వెళ్లడంతో ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అపర్ణకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఓటు వేసి వస్తుండగా ఇలా ప్రమాదం జరగడం పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇదిలా ఉంటే.. మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం, కోలపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించడంతో మృతుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.